ఉనికి కోసమే ఆందోళనలు, ఆయనది రాక్షసబుద్ది,ప్యాకేజీతోనే ప్రయోజనం
అమరావతి: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో విపక్షాలు ఆందోళన చేయడాన్ని అధికార పార్టీకి చెందిన నాయకులు తప్పుబడుతున్నారు. విపక్షాలు ఉనికి కోసమే ఆందోళనలు చేస్తున్నాయని అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇటీవల కాలంలో ఆందోళన బాట పట్టాయి.విశాఖ ఆర్ కె బీచ్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.
అయితే విపక్షాలు రాష్ట్రంలో అనవసర రాద్దాంతాన్ని చేస్తున్నాయని అధికార పార్టీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే అన్ని రకాల కార్యక్రమాలను తాము చేపడుతున్నట్టు అధికార పార్టీ నాయకులు ప్రకటించారు.
ప్రభుత్వంపై దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకొనేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. జల్లి కట్టు స్పూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలకు పిలుపునివ్వగా ప్రభుత్వం ఎక్కడికక్కడే అరెస్టు చేసింది.
ఉనికి కోసమే ఉద్యమాలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాలు చేస్తోన్న ఆందోళనలు తమ ఉనికిని కాపాడుకొనేందుకు మాత్రమే పనికి వస్తాయని కేంద్ర మంత్రి సుజానా చౌదరి విమర్శించారు.గుంటూరు జిల్లా బాపట్లలో 1257 మంది దివ్యాంగులకు 1.35 కోట్ల విలువ చేసే పరికరాలను మంత్రి పంపిణీ చేశారు.విపక్షాలు అనుసరిస్తోన్న వైఖరిని ఆయన తప్పుబట్టారు.
ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఎక్కువ లాభాలు
ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఎక్కువ లాభాలున్నాయని కేంద్ర మంత్రి సుజానా చౌదరి అభిప్రాయపడ్డారు. హోదా కంటే ఎక్కువ ప్రయోజనం ఉన్నందునే స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ఏది ప్రయోజనం కలుగుతోందో తెలుసుకొని దానికే ప్రభుత్వం మొగ్గుచూపిందని ఆయన చెప్పారు.అయితే రాష్ట్రానికి మేలు జరుగుతోన్న ప్యాకేజీని కాదనడం సరికాదన్నారు కేంద్రమంత్రి.విపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమం చేయడం సరికాదన్నారు.
అధికారులపై జగన్ బెదిరింపులు
పదవీ వ్యామోహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఉన్నారని , ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు.ముఖ్యమంత్రిని అవుతానని జగన్ పగటి కలలు కంటున్నారని ఆయన చెప్పారు.అధికారులపై బెదిరింపులకు జగన్ పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.
విపక్షాలు అభివృద్ది నిరోధకులు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ది జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. విపక్షనేత జగన్ అభివృద్ధి నిరోధకుడిగా మారాడని ఆయన విమర్శలు గుప్పించారు. విశాఖలో గణతంత్రదినోత్సవం సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో జగన్ ఆందోళన నిర్వహించడం సరికాదన్నారాయన.విపక్షనేత జగన్ ది రాక్షస బుద్ది అని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.