ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఫలితం ఇదా: జగన్ ప్రభుత్వానికి టీడీపీ పవర్ షాక్: రాష్ట్రవ్యాప్తంగా
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం.. నిరసనల పర్వానికి తెర తీసింది. మరో యుద్ధాన్ని ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు వేల రూపాయల్లో రావడాన్ని నిరసిస్తూ నిరసన దీక్షలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ధర్నాలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా- తమ నివాసాల్లోనే ఉంటూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలను సంధిస్తున్నారు.
ఉధృతి తగ్గని కరోనా: ఏపీలో అదే తీరు: ఈ సారీ భారీగా పాజిటివ్ కేసులు: ఇప్పటికింతే
ర్యాండమ్గా పవర్ బిల్స్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను అమలు చేసిన సమయంలో విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగులను తీసుకోలేదు. ర్యాండమ్గా రెండు, మూడు నెలల బిల్లులను వినియోగదారులకు పంపించారు. ఒక్కో వినియోగదారుడికి వేల రూపాయల్లో బిల్లులు వచ్చాయి. సామాన్య ప్రజలకు కూడా షాక్ కొట్టేలా.. కళ్లూ బైర్లు కమ్మేలా బిల్లులను పంపించారు డిస్కమ్స్ సిబ్బంది. ఇది కాస్తా జగన్ ప్రభుత్వంపై పేద, మధ్య తరగతి కుటుంబీకుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైంది.
12 గంటల దీక్ష..
ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ పావులు కదిపింది. పెరిగిన విద్యుత్ బిల్లుల అంశాన్ని రాజకీయంగా మలచుకుంది. వేల రూపాయల్లో వచ్చిన విద్యుత్ బిల్లుల వల్ల ప్రతి కుటుంబం కూడా ప్రభావితమైంది. దీనితో వారి తరఫున పోరాటానికి దిగింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల విద్యుత్ బిల్లులను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు. 12 గంటల పాటు నిరసన దీక్ష చేయనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు ఆరంభమైన దీక్ష రాత్రి 9 గంటలకు ముగుస్తుంది.
పలువురు నేతల్లో దీక్షల్లో..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు తమ నివాసాల్లోనే నిరసనలకు దిగారు. విజయవాడలో కేశినేని శ్వేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట ప్రసాద్, కడప జిల్లా ప్రొద్దుటూరులో డాక్టర్ ప్రవీణ్ కుమార్ నిరసన దీక్షలను చేపట్టారు.
ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు..
తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీమంత్రి కళా వెంకట్రావ్.. విజయవాడలో కేశినేని శ్వేత నిర్వహించిన దీక్షకు సంఘీభావాన్ని తెలిపారు. అక్కడే ఆయన దీక్షకు కూర్చున్నారు. మరో మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ డిస్కమ్ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం దొంగదారిన ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందని విమర్శించారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు దొడ్డిదారిన నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.