టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారు: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దూరమంటూ కొడాలి నాని కామెంట్స్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.
చంద్రబాబు మాటలు నమ్మొద్దు: కొడాలి నాని
చంద్రబాబు హయంలో ఐదేళ్లలో చెల్లించింది తాము ఏడాదిలోనే చెల్లించామని కొడాలి నాని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకి రూ. 5,056 కోట్లు చెల్లించాలని, జులై నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా ఇస్తామని తెలిపారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు మంత్రి కొడాలి నాని. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు చంద్రబాబు ఏనాడూ సకాలంలో చెల్లించలేదని చెప్పారు. రైతు రాజులా బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
చంద్రబాబు, ఎల్లో మీడియాకు అదేపనంటూ కొడాలి నాని విమర్శలు
చంద్రబాబుకు సామాజిక న్యాయం అంటే ఆయన కులానికే న్యాయం చేయడమని విమర్శించారు. ఆర్థిక, సామాజిక వెనుకబడినవారికి ఒకేసారి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియాకు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు.
Recommended Video
బాబు టీడీపీని బీజేపీలో విలీనం చేస్తాడన్న కొడాలి.. పవన్ దూరం
చంద్రబాబుతో బీజేపీ, పవన్ కళ్యాణ్ జనసేన కలవవని వ్యాఖ్యానించారు మంత్రి కొడాలి నాని. లోకేష్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు తెలుసన్నారు. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ గెలవదని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ సీఎం కూడా మమిళలకు 50 శాతం పదవులను కేటాయించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలంతా ఆయనకు అండగా నిలవాలని పుష్పశ్రీవాణి ఆకాంక్షించారు.