చంద్రబాబుకు మతిపోయింది- లోకేష్ గేరుమార్చలేకపోతున్నాడు- ఎమ్మెల్యే వంశీ కామెంట్స్...
ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నగదు బదిలీ చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమర్ధించారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న విమర్శలను వంశీ తప్పుబట్టారు. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఏది మంచో ఏది చెడో ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని, ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకం అమలులో మంచి చెడులు చూశాక విమర్శలు చేస్తే బావుండేదని వంశీ సూచించారు. కానీ చంద్రబాబు మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని వంశీ ఆరోపించారు.
కులం: హీరో రామ్పై వల్లభనేని వంశీ సీరియస్ కామెంట్స్, చంద్రబాబునూ వదల్లేదు
నగదు బదిలీ పథకం మంచిదే..
ఏపీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీని ప్రవేశపెట్టాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వంశీ సమర్ధించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ విషయంలో చంద్రబాబు వైఖరిని ఆయన ఓసారి గుర్తుచేశారు. 2004లో ఉచిత విద్యుత్ నినాదంపైనే ఎన్నికలు జరిగాయని, హామీ ప్రకారం అప్పటి సీఎం వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారని వంశీ గుర్తుచేశారు. ఆయన ఉన్నంత కాలం ఉచిత విద్యుత్ హామీ అమలైందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నీరుగార్చాయన్నారు.. తిరిగి జగన్ అధికారంలోకి రాగానే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అమలుకు హామీ ఇస్తున్నారని వంశీ తెలిపారు. కేంద్రం సంస్కరణల ప్రకారం మీటర్లు పెట్టినా రైతులు నేరుగా డబ్బులు కట్టాల్సిన పని లేదని, పెన్షనర్లు, ఉద్యోగుల తరహాలో అకౌంట్లలో డబ్బులు ఇవ్వబోతోందని వంశీ తెలిపారు. నగదు బదిలీ పథకం వల్ల డిస్కమ్లు రైతులను బెదిరించే అవకాశం ఉండదన్నారు.
నగదు బదిలీ ఎందుకు మేలంటే ?
ఉచిత విద్యుత్లో నగదు బదిలీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వంశీ తెలిపారు. ఇందుకు ఆయన కొన్ని ఉదారహణలు కూడా చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా కరెంటు ఇచ్చినా కనెక్షన్లు క్రమబద్ధీకరించలేదని, అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా డిస్కంలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్ధలు కాబట్టి వాటికి చెప్పలేమని ప్రభుత్వ పెద్దలు చెప్పారని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపు జరుగుతుందని వంశీ తెలిపారు. మీటర్ల కొనుగోలు భారం కూడా రైతులపై ఉండబోదన్నారు. జల విద్యుత్ అందుబాటు ఉంటుందో లేదో తెలియదు కాబట్టి 10 వేల మెగావాట్లతో సౌరవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి రైతుల ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నట్లు సీఎం చెప్పారని వంశీ తెలిపారు.
42 ఏళ్ల అనుభవం ఏమైంది ?
తాను స్కూల్కు వెళ్లకముందే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారని, 42 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పారని వంశీ గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు నగదు బదిలీ పథకం రైతులకు ఉరితాడు అవుతుందని చెప్పడంపై వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకం రైతులకు ఎలా ఉరితాడు అవుతుందో చెప్పాలన్నారు. చంద్రబాబు మాటలు లోకేష్లా ఉన్నాయన్నారు. చంద్రబాబు మాటలు నవలలను మరిపిస్తున్నాయని, కరోనాకు భయపడి రూమ్లో జూమ్ మీటింగ్స్ నిర్వహించి ఆయనకు మతిభ్రమించిందన్నారు.
గేరు మార్చలేని లోకేష్ని చూసి...
వచ్చే ఎన్నికలకు చంద్రబాబుకు 76 ఏళ్ల వయసు వస్తుందని, మరోవైపు పుత్రరత్నం లోకేష్ గేరు వేయలేకపోతున్నాడు, యాక్సిలేటర్ తొక్కలేకపోతున్నాడనే ఆవేదనతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని వంశీ విమర్శించారు. చంద్రబాబును చూస్తుంటే స్కిజోఫీనియా అనే వ్యాధితో భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు దగ్గర పది వేలకు పనిచేసే ఉద్యోగులు మాట్లాడినట్లు ఆయన మాట్లాడితే బాగోదన్నారు. ప్రభుత్వ నిర్ణయం ఫలితాలను గమనించాలని, ఇప్పుడే ఎన్నికలు లేవు ఎందుకొచ్చిన తొందరన్నారు. ఉచిత విద్యుత్పై విమర్శలు చేస్తున్న పొరుగు రాష్ట్రాల వారికి ఏపీలో ఎకరం పొలమైనా ఉందా అని వంశీ ప్రశ్నించారు.