వైసీపీలో 80శాతం క్రిమినల్సే.. జగన్ దుర్యోధనుడిలా నాశనమవుతాడు : యనమల
గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చినట్టయింది. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు కొనసాగుతున్నాయన్న ఆయన.. అసలు వాటి అవసరం ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనే విద్యావేత్తలు,న్యాయవాదులు,ప్రొఫెసర్లు ఉన్నప్పుడు మండలి అవసరమేంటన్నారు. మండలి కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.60 కోట్ల భారం పడుతుందన్నారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి,టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు.

యనమల ఏమన్నారు..
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తనయుడు జగన్ను చదువుకోమని అమెరికా పంపిస్తే పారిపోయి వచ్చాడని యనమల విమర్శించారు. కాబట్టి జగన్కు తెలియకపోతే ఇతరుల సలహాలైనా తీసుకోవాలని సూచించారు. తమ పార్టీలో పీహెచ్డీలు చేసినవారు,ప్రొఫెసర్స్,ఐఆర్ఎస్లు ఉన్నారని జగన్ చెప్పడాన్ని యనమల విమర్శించారు. వైసీపీలోని 80శాతం నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు.
సాధారణంగా మండలిలో బిల్లుపై ఓటింగ్ జరుగుతున్నప్పుడు సంబంధిత మంత్రులు మాత్రమే అక్కడ ఉంటారని,కానీ బుధవారం ఏకంగా 22 మంది మంత్రులు మండలిలోకి వచ్చారని ఆరోపించారు.
ఓటింగ్ జరుగుతున్నప్పుడు సంబంధిత మంత్రులను మినహాయించి మిగతావాళ్లను పంపించాల్సిందిగా రూల్.90 కింద నోటీసులు ఇచ్చామన్నారు.

అసెంబ్లీలో ప్రొసీజర్ ఫాలో అయ్యారా..
అసెంబ్లీతో పాటు మండలికి కూడా సమాన అధికారాలు ఉంటాయన్నారు యనమల. కొన్ని తేడాలు మినహా అసెంబ్లీ రూల్స్ బుక్,మండలి రూల్స్ బుక్ ఒకేలా ఉంటాయన్నారు. అసెంబ్లీ నుంచి మండలికి వచ్చిన బిల్లును.. అక్కడి సభలో సవరణలు ప్రతిపాదించవచ్చు,తిరస్కరించవచ్చు లేదా సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు అన్నారు. ప్రొసీజర్ ఫాలో అవకుండా అసెంబ్లీలో బిల్లును ఆమోదించుకుని.. మండలిలో నిబంధనలు పాటించలేదనడం సరికాదన్నారు. ఉదయం 9గంటలకు కేబినెట్ భేటీ పెట్టి,10 గంటలకు బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి.. 11గంటలకు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అదే రోజు బిల్లులను ప్రవేశపెట్టి.. అదే రోజు ఎలా పాస్ చేస్తారని ప్రశ్నించారు. కనీసం సభ్యులకు బిల్లులను చదువుకునే సమయం ఇవ్వరా అని ప్రశ్నించారు. వైసీపీ అన్ని నిబంధనలను ఉల్లంఘించిందన్నారు.

దుర్యోదనుడిలా నాశనం అవుతాడు..
బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంలో తప్పేమీ లేదన్నారు యనమల. అసెంబ్లీలో మెజారిటీ ఉందని బిల్లులను బుల్డోజ్ చేసుకున్నప్పుడు.. మండలిలో తమకు మెజారిటీ ఉంది కాబట్టి సెలెక్ట్ కమిటీకి పంపించామన్నారు. అసలు అమరావతి అంటేనే జగన్కు ఒకరకమైన అలర్జీ అన్నారు. అమరావతిని చూస్తే.. ఆయనకు చంద్రబాబే గుర్తుకు వస్తారని.. అందుకే విశాఖకు తరలిస్తున్నారని అన్నారు.
మహాభారతంలో మయసభను చూసి అసూయ,ఈర్ష్య పెంచుకున్న దుర్యోదనుడు చివరకు ఎలా నాశనమయ్యాడో అందరికీ తెలుసునని, జగన్కు కూడా అదే గతి శాపనార్థాలు పెట్టారు.

తుగ్లక్ చర్యలు..
రాజధానిని వైసీపీ ప్రభుత్వం విశాఖకు తరలిస్తుండటంతో.. అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. జగన్ వ్యవహారం తుగ్లక్ను తలపిస్తోందన్నారు. తుగ్లక్ కూడా ఢిల్లీ నుంచి దౌల్తాబాద్కు,దౌల్తాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిని తరలించాడని.. ఈ క్రమంలో ఎంతోమంది చనిపోయారని చెప్పారు. తుగ్లక్ సౌత్ ఇండియాను కూడా ఆక్రమించుకోవాలని ప్లాన్ చేసినట్టు.. జగన్ విశాఖను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇప్పటికే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా విశాఖకు సెక్రటేరియట్ను తరలించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తమకు రాజధాని కావాలని విశాఖ వాసులు కూడా కోరలేదన్నారు.












Click it and Unblock the Notifications