జగన్ వైఖరిపై జాతీయ స్థాయిలో: టీడీపీ ఎమ్మెల్సీల హస్తిన ప్రయాణం: సీమ నేతలు డౌటే.. !
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న సంచనల నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రెడీ అవుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో అమరావతి రైతులు కొనసాగిస్తోన్న పోరాటాన్ని ఇప్పటికే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిన టీడీపీ.. ఇక శాసన మండలిని ప్రొరోగ్ చేయడాన్ని కూడా అదే దృష్టితో చూస్తోంది. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది.

ప్రొరోగ్ చేయడాన్ని నిరసిస్తూ..
రాష్ట్ర శాసన సభ, శాసన మండలిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రొరోగ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ ఆయన గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శాసనసభ, మండలిని ప్రొరోగ్ చేసిన నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) రద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిఫారసుల మేరకే గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది తెలుగుదేశం పార్టీ వాదన.
Recommended Video

అమిత్ షా మొదలుకుని రాష్ట్రపతి దాకా..
శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మొదలుకుని, రాష్ట్రపతి దాకా అందర్నీ కలుసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లను కలుసుకోనున్నారు. వారికి వినతిపత్రాలను అందజేయనున్నారు. వైఎస్ జగన్ వైఖరిని వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుసుకోనున్నారు.

జగన్ వెళ్లొచ్చిన వెంటనే..
దీనికోసం ఇప్పటికే ఆయా నేతల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రెండురోజుల కిందటే ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. శుక్రవారం ఆయన మరోసారి హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సారి ఆయన అమిత్ షాను కలుస్తారు. జగన్ ఢిల్లీ నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వెంటనే టీడీపీ ఎమ్మెల్సీలే ఢిల్లీ విమానం ఎక్కేలా షెడ్యూల్ను రూపొందించుకున్నారని తెలుస్తోంది.

యనమల సారథ్యంలో..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో టీడీపీ సభాపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు సారథ్యంలో వారంతా న్యూఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఢిల్లీకి వెళ్తారా? లేక మరి కొందరు ఆగిపోతారా? అనేది తెలియ రావాల్సి ఉంది. టీడీపీ వ్యవహార తీరుపై అసంతృప్తితో ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications