ఏపీకి గుడ్ బై చెప్పనున్న అమరరాజా -చిత్తూరు నుంచి చెన్నైకి బ్యాటరీ ప్లాంట్ -గల్లా జయదేవ్ సంచలనం, స్టాలిన్ ఓకే?
ఆంధ్రప్రదేశ్ లో పవర్ పాలిటిక్స్ పీక్ దశకు చేరాయా? వ్యాపారం-రాజకీయ ఆధిపత్యం మధ్య ఉండే గీత చెరిగిపోయిందా? ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల కంపెనీలను జగన్ సర్కారు టార్గెట్ చేస్తోందా? ఆ దెబ్బకు టీడీపీ నేతల కుటుంబాలకు చెందిన కంపెనీలు ఆంధ్రాను వీడనున్నాయా? తరహా ప్రశ్నలు ఈ నాటివి కావు. రెండేళ్ల కిందట వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ప్రతిపక్ష టీడీపీ ఈ తరహా ప్రచారం చేస్తూనే వస్తున్నది. ప్రఖ్యాత కియా మోటర్స్, మరెన్నో మేలు రకం కంపెనీలు ఏపీకి గుడ్ బై చెప్పి పక్క రాష్ట్రాలకు తరలివెళతాయని జోరుగా వార్తలొచ్చాయి. కానీ ఈసారి నిజంగానే ఆందోళన కలిగించేలా..
Recommended Video

ఏపీకి అమర రాజా గుడ్ బై?
ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమల తరలింపులపై పలు రకాల విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ అవి ప్రమాదకర స్థాయికి వెళ్లలేదు. కానీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ విషయంలో వివాదం చాలా పెద్దదైంది. కాలుష్యం కారణంగా ఏపీ సర్కారు ఏకంగా అమరరాజా ప్లాట్ మూసివేతకు ఆదేశాలివ్వడం సంచలనం రేపింది. పర్యావరణ నిబంధనల పాటించడంలేదంటూ చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ ప్లాంట్ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులివ్వడం, హైకోర్టు స్టే ఇవ్వడంతో సదరు మూసివేత ఉత్తర్వులు నిలిచిపోవడం తెలిసిందే. కాగా, జగన్ సర్కారుతో విభేదాల కారణంగానే గల్లా జయదేవ్ నేతృత్వంలోని అమరరాజా బ్యాటరీస్ ఏపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు..

తమిళనాడు సీఎం స్టాలిన్ రెడ్ కార్పెట్
బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన అమరరాజా సంస్థ బ్యాటరీల తయారీ రంగంలో దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీ కావడం గమనార్హం. ఏపీ సర్కారు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో న్యాయపోరాటం చేస్తోన్న అమరరాజా.. చిత్తూరు జిల్లాలోని తన బ్యాటరీల ప్లాంటును తమిళనాడుకు తరలించాలని యోచిస్తున్నట్లు సోమవారం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అమరరాజా బ్యాటరీస్ చెన్నైకి తరలివెళుతోందని, ఆ సంస్థకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచారని, ఇప్పటికే కేటాయించిన స్ధలంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని, రాబోయే 3నెలల్లోనే అమరరాజా ప్లాంటు చిత్తూరు నుంచి తమిళనాడుకి తరలివెళ్లనుందని సోషల్ మీడియాలోనూ పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

అమరరాజా చైర్మన్గా గల్లా జయదేవ్ కాగానే..
బ్యాటరీల తయారీ రంగంలో దేశంలోనే రెండో అతిపెద్ద సంస్థ అమరరాజా ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. పన్నుల రూపంలో ఆ సంస్థ ఏటా రూ.2400 కోట్లు చెల్లిస్తున్నదని, అమరరాజా చెల్లించే పన్నులలో ఏపి వాటా రూ.1200కోట్లని తెలుస్తున్నది. సొంత జిల్లా చిత్తూరులో ఉపాధి మార్గాలు పెంచాలనే లక్ష్యంతో గల్లా కుటుంబం ప్రారంభించిన అమరరాజా సంస్థ ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోనుందని సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకుని, ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టిన వేళ ఈ తరహా ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. కాగా, ఈ వార్తకు సంబంధించి అటు అమరరాజా సంస్థ నుంచి లేదా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటనలు రాలేదు.












Click it and Unblock the Notifications