టీడీపీ ఎంపీల విరాళం 7 కోట్లు, బాబుకు వెంకయ్య ఫోన్
హైదరాబాద్: తుఫాను ప్రభావిత ప్రాంతాలలో చేపడుతున్న సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు పాలుపంచుకుంటారని ఎంపీ సుజనా చౌదరి మంగళవారం తెలిపారు. ఎంపీల నిధుల నుండి రూ.25 లక్షలతో పాటు రెండు నెలల జీతం సహాయం చర్యలకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అందరు రూ.7కోట్లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
విశాఖకు వెంకయ్య
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం విశాఖకు రానున్నారు. ఆయన చీఫ్ విప్ల సమావేశంలో పాల్గొనడానికి గోవాలో ఉన్నారు. సోమవారం రాత్రికి గోవా నుండి బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఎక్స్గ్రేషియా

హుధుద్ తుపాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఇస్తారు. తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. 50 వేలు నష్టపరిహారాన్ని ప్రకటించారు.
వంట పాత్రలు, బట్టల కోసం రూ. 2 వేలు, బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, అర కేజి కారం, కేజీ చక్కెర, 3 కేజీలు ఆలుగడ్డలు ఈ సాయంత్రమే అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే మత్స్యకారుల వలకు రూ.5వేలు, బోటుకు రూ. 10 వేలు చొప్పన నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
దెబ్బతిన్న వరి, ఇతర పంటలకు రూ. 10 వేలు నష్టపరిహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ. 50 వేలు, గుడిసెలకు రూ. 25 వేలు సాయం అందజేయనున్నారు. నేలకొరిగిన పైర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు విలేకరుల సమావేశంలో చెప్పారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించి, మొత్తం నష్టాన్ని అంచనా వేస్తామని చంద్రబాబు చెప్పారు. విశాఖ జిల్లాలో వరద బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తుపాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానికంగా క్యాంపులు పెట్టి సాయం అందజేస్తామన్నారు. సోమవారం సాయంత్రంలోగా ఆస్పత్రుల్లో విద్యుత్ పునరుద్దరిస్తామన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలన్నారు. జనరేటర్లద్వారా నీటిని పంపిణీ చేస్తామన్నారు. అలాగే శ్రీకాకుళం వెళ్లి అక్కడ తుపాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని సమీక్షించాలని డిప్యూటీ సీఎం చినరాజప్పకు సూచించారు.












Click it and Unblock the Notifications