వంశీని వదులుకోలేం.. మరో పక్క టీడీపీ ప్లాన్ బీ ఏంటో తెలుసా?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎమ్మెల్యే గానూ, టిడిపి ప్రాథమిక సభ్యునిగానూ రాజీనామా చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తో విలవిలలాడుతుంది. వల్లభనేని వంశీని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు, వల్లభనేని వంశీల మధ్య లేఖల రాయబారాలు కొనసాగాయి. ఇక తాజాగా ఎంపీ కేశినేని నాని తోపాటు మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ వంశీ దగ్గరకు వెళ్లి మంతనాలు జరిపారు. పార్టీని వీడి వెళ్ళొద్దని కోరారు. కానీ వల్లభనేని వంశీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కనిపించలేదు.వంశీ నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది.దీంతో టిడిపి ప్లాన్ బి సిద్ధం చేస్తుంది.
గన్నవరం ఉప ఎన్నికలొస్తే రంగంలోకి గద్దె
గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మోహన్ పైటీడీపీ ఆశలు వదిలేసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఒకవేళ వంశీ మోహన్ తమ అభ్యర్థనను మన్నించి పార్టీలో కొనసాగితే ఓకే లేదంటే ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపై కూడా టిడిపి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందులో గన్నవరం స్థానం నుంచి పార్టీ సీనియర్ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సతీమణి , కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది టీడీపీ శ్రేణులలోనూ ఆసక్తికరంగా మారింది.
గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో చరిష్మాతో గెలిచిన గద్దె రామ్మోహన్ , వల్లభనేని వంశీలు
వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం నియోజకవర్గంలో చరిష్మా ఉన్న నేత. టీడీపీ నేతగా కంటే కూడా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు అత్యంత సన్నిహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి జోరుగా వీచినప్పటికీ కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లుంటే వాటిలో వైసీపీ 14 సీట్లను కైవసం చేసుకోగా గద్దె రామ్మోహన్ రావుతో పాటు వంశీ మాత్రమే టీడీపీ తరఫున గెలిచారు. జనంలో మంచి నేతగా గుర్తింపు పొందిన క్రమంలోనే అటు గద్దె రామ్మోహన్ తో పాటు ఇటు వంశీ మోహన్ కూడా విజయం సాధించారు.
బరిలోకి గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధను దింపాలనే ఆలోచన
వైసీపీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని నిలబడ్డ క్రమంలోనే వంశీని వదులుకోమంటూ టీడీపీ ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ వంశీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదన్న అనుమానం సైతం వ్యక్తం చేస్తున్న టీడీపీ అధిష్టానం ఒక పక్క బుజ్జగిస్తూనే మరో పక్క ప్లాన్ బి సిద్ధం చేసుకుంది . గన్నవరం స్థానానికి బైపోల్స్ తప్పవని భావిస్తున్న నేపథ్యంలో అదే జరిగితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో మంచి పేరున్న నేత గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధను బరిలోకి దింపాలని ఇప్పటికే టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చేసిందన్న వార్తలు టిడిపి శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
గద్దె రామ్మోహన్ కు ఉన్న ఫాలోయింగ్ గెలిపిస్తుంది అన్న నమ్మకంలో టీడీపీ
కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి భారీ అనుచరగణం ఉన్న గద్దె రామ్మోహన్ కు గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నిక బాధ్యత అప్పగించి ఆయన సతీమణి గద్దె అనురాధను రంగంలోకి దింపితే టిడిపి సిట్టింగ్ స్థానం తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని ప్లాన్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. వల్లభనేని వంశీ వ్యవహారంపై చర్చించారు.
వంశీ పార్టీలో ఉంటే ఓకే .. లేకుంటే ప్లాన్ బీ అమలుకు కసరత్తు
వంశి ని ఎలాగైనా పార్టీలో ఉండేలా చూడాలని, అది సాధ్యం కాకుంటే తప్పనిసరిగా ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి గద్దె అనురాధ ను రంగంలోకి దింపాలని, గన్నవరం నియోజకవర్గం కేంద్రంలో నెలకొన్న అనిశ్చితిని దూరం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ రాజీనామా టిడిపికి పెద్ద షాక్ అని చెప్పాలి. ఆయన రాజీనామా నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో టిడిపిని కాపాడుకోవడానికి ప్లాన్ బి రూపొందించినప్పటికీ అది ఏమేరకు వర్కౌట్ అవుతుందనేది టీడీపీకి టెన్షనే.