ప్రజావేదిక-అమరావతి: జగన్ చేసేది విధ్వంసమేనంటూ చంద్రబాబు నిప్పులు
అమరావతి: రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమరావతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఆయన వైఎస్ జగన్ సర్కారుపై మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ కోసం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.

ప్రజావేదిక-అమరావతి విధ్వంసమే..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జగన్ సర్కారు ప్రజా వేదిక విధ్వంసంతో మొదలు పెట్టి.. ఇప్పుడు అమరావతిని విధ్వసం చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అభివృద్ధిని మర్చిపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు.
Recommended Video

పరిపాలన చేతకాదంటూ..
ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేతకాదని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, రాధాకృష్ణ, శేషారావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగటూరు మండలంలో ఆయన యాత్ర కొనసాగించారు. నారాయణపురంలో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ జోలెపట్టి విరాళాలు సేకరించారు. స్థానిక దుకాణదారులు, రైతులు, యువకులు, ప్రజలు విరాళాలు అందజేశారు. భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెంట భారీగా తరలివచ్చారు.

మరోవైపు భువనేశ్వరి..
మరోవైపు చంద్రబాబు సతీమణి కూడా అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా తాను గాజులు విరాళంగా ఇవ్వడంపై వచ్చిన విమర్శలను పట్టించుకోనని.. వారి పోరాటానికి చివరి వరకు అండగా ఉంటామని తెలిపారు. తన మనసులోంచి వచ్చిన భావనతోనే తాను తన గాజులను రైతులకు విరాళంగా ఇచ్చానని తెలిపారు. అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పదని ఆమె అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగే వరకూ తాము పోరాటం చేస్తామన్నారు

32వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
ఇది ఇలావుంటే, అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం నాటికి 32 రోజులకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో నిర్వహించిన ధర్నాలో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 29 గ్రామాల రైతులు, ప్రజలు రోడ్లపైకి వచ్చారని.. ఇప్పటికైనా జగన్ సర్కారు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications