నాకు విప్ జారీ చేసేంత మగాడా?.. చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్.. టీడీపీకే వేశానన్న మద్దాలి గిరి..
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ తమకు విప్ జారీ చేయడంపై రెబల్ ఎమ్మెల్యేలైన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. మళ్లీ ఓటేలా అడుగుతారంటూ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల టీడీపీ ఇలాంటి దుస్థితిలోకి జారుకోవడం బాధగా ఉందని, అందుకు కారణం చంద్రబాబేనని ఎమ్మెల్యేలు విమర్శించారు.

టీడీపీకి 17 ఓట్లేనా?
కరోనా సమయంలో పదో తరగతి పరీక్షలు ఎందుకని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు కారణం అయ్యారని, ఇంత చేసి.. టీడీపీకి కేవలం 17 ఓట్లు మాత్రమే పడినట్లు తెలుస్తోందని రెబల్ ఎమ్మెల్యే వంశీ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మరో ఎమ్మెల్యే మద్దాలి గిరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఎంతో చరిత్ర ఉన్న టీడీపీ ఇలాంటి దయనీయమైన పరిస్థితికి వస్తుందనుకోలేదని వంశీ అన్నారు.

బాబు దగ్గర ఏముంది?
రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అదిష్టానం విప్ జారీ చేసిందా? అన్న ప్రశ్నకు ఎమ్మెల్యే వంశీ బదులిస్తూ.. ‘‘నాకు విప్ జారీ చేసేంత మగాడా?.. అయినా విప్ జారీ చేయడానికి చంద్రబాబు దగ్గర ఏముంది.. ఉడకబెట్టిన నాగడి దుంప.. ''అని ఎద్దేవా చేశారు. తనను గతంలోనే టీడీపీ నుంచి తనను బహిష్కరించారని, స్పీకర్ ఆదేశాల మేరకు తాను ప్రత్యేక సభ్యుడిగా కొనసాగుతున్నానని, పార్టీ నుంచి సస్పెండైన తనకు విప్ ఎలా జారీ చేస్తారని వంశీ ప్రశ్నించారు.

వాటితోనే బాబుకు ప్రాణం..
చంద్రబాబు తన పక్కనున్న చెంచాల మాటను వినడం కొనసాగిస్తే.. అతిత్వరలోనే గిన్నె ఖాళీ అయిపోవడం ఖాయమని, నిజానికి హైదరాబాదులో ఉన్న కొన్ని చానల్స్ కు డబ్బులిచ్చి రాయిస్తున్న వార్తలే చంద్రబాబుకు ప్రాణం పోస్తున్నాయని వంశీ అన్నారు. కచ్చితంగా గెలుస్తామనుకున్నప్పుడు వ్యాపారవేత్తలకు.. అసలు గెలిచే అవకాశమే లేనప్పుడు వర్ల రామయ్య లాంటి దళితులకు టికెట్లు ఇవ్వడం చంద్రబాబు ఒక్కరికే సాధ్యమని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు వైసీపీ అమలు చేసిందని వంశీ కొనియాడారు.

ఓటు టీడీపీకే..
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో తాను పార్టీ నిర్ణయానుసారం నడుచుకున్నానని, టీడీపీ నిలబెట్టిన వర్ల రామయ్యకే ఓటేశానని రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. ఓటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన మద్దాలి.. తనకు టీడీపీ నుంచి ఎలాంటి విప్ అందలేదని, అయితే, దళితుడన్న గౌరవంతోనే వర్ల రామయ్యకే ఓటేశానని వెల్లడించారు. కాగా, ఓటు టీడీపీకే వేసినా.. టెక్నికల్ గా అది చెల్లని విధంగా రెబల్స్ వ్యవహరించినట్లు తెలుస్తోంది.

లోకేశ్ ను నిలబెట్టండి..
టీడీపీ ప్రస్తుత దుస్థితికి చంద్రబాబు తీరే కారణమని, ఆయన తన పక్కనున్న బ్యాచ్ను పక్కన పెడితే తప్ప పార్టీ బాగుపడదని, ఇప్పటికైనా చంద్రబాబుకు పార్టీపై దృష్టిపెట్టే ఓపిక లేకపోతే.. వెంటనే అధ్యక్ష పదవిలో నారా లోకేష్నైనా కూర్చోబెట్టాలని ఎమ్మెల్యే గిరి సూచించారు. గతంలో చంద్రబాబు తులాభారం వేసి టిక్కెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు కనీసం ఆయన్ను నమ్మేవాళ్లు ఒక్కరూ లేరని మద్దాలి అన్నారు.












Click it and Unblock the Notifications