మాగంటి బాబు పార్టీ మారుతున్నారా ? తేల్చేసిన మాజీ ఎంపీ..!
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. రాజకీయ పార్టీల నేతలు తమ సొంత పార్టీల్లో టికెట్లు దొరక్కపోతే ఇతర పార్టీల్లోకి ఫిరాయించేందుకు సై అంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) తన సొంత పార్టీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ ను పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు చంద్రబాబు కేటాయించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మాగంటి బాబు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇవాళ అనుచరులతో భేటీ ఏర్పాటు చేయడంతో మాగంటి బాబు పార్టీ మారడం ఖాయమన్న చర్చ సాగింది. దీనిపై ఇవాళ ఆయన స్వయంగా స్పందించారు. తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.

గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని మాగంటి బాబు తేల్చిచెప్పేశారు. తాను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. వ్యక్తిగత పనుల వల్ల హైదరాబాద్ లో ఉండటంతో ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో లేనన్నారు. అంతే కానీ టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదన్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో భేటీలో మాగంటి బాబు క్లారిటీ ఇచ్చేయడంతో టీడీపీ ఊపిరిపీల్చుకుంది.












Click it and Unblock the Notifications