ఏపీలో కొత్త జిల్లాకు పీవీ పేరు- టీడీపీ సరికొత్త డిమాండ్....
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది కల్లా ఎట్టి పరిస్ధితుల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం అధికారుల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయా కమిటీల అధ్యయనం కొనసాగుతోంది. వీటి ఏర్పాటుకు ముందు కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఆ తర్వాత సీంఎం జగన్ ఆదేశాలతో సైలెంట్ అయిపోయారు.
కానీ టీడీపీ నేతలు మాత్రం ఇంకా కొత్త జిల్లాల డిమాండ్లను వినిపిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. మాజీ ప్రధాని, తెలుగు వారందరూ గర్వించదగిన నేత పీవీ నరసింహారావు పేరును త్వరలో ఏర్పాటయ్యే కొత్త జిల్లాల్లో ఒకదానికి పెట్టాలని టీడీపీ మద్దతున్న ఇండో- అమెరికన్ బ్రాహ్మణ సమాఖ్య వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
బహుబాషాకోవిదుడు, అపర చాణక్యుడు, భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అనేక రంగాల్లో విశేష సేవలందించారని, ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 25 జిల్లాల్లో ఒక జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంఘం చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ సీఎం జగన్కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. అదే మనం ఆయనకిచ్చే గౌరవం అన్నారు.
Recommended Video
కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలు చేపట్టి గాడిలో పెట్టారు. విద్యారంగంలో పీవీ తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపించజేశారని ఆయన గుర్తుచేశారు పీవీ తెలుగువాడిగా పుట్టడం మనందరికీ గర్వకారణమని, ఆయన జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని అన్నారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడంతో పాటు ఆయన దేశానికి చేసిన సేవలను భావి తరాలకు తెలియజేయడం మనందరి బాధ్యత అని బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు.