బాండ్ లపైనే టిడిపి ధీమా...స్పందనే నిదర్శనం అంటున్న పార్టీ శ్రేణులు
అమరావతి:అమరావతి బాండ్లకు లభించిన స్పందనపై టిడిపి శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి. అమరావతి నిర్మాణానికి సీఆర్డీయే రూ.1300 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయగా, గంటలోనే రూ.2వేల కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది అమరావతి నిర్మాణంపై ఉన్న విజన్, చంద్రబాబుపై నమ్మకమే కారణమని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి నిర్మాణానికి మోడీ ఇచ్చినదానికంటే బాండ్ల ద్వారా వచ్చిందే ఎక్కువని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మొత్తం మూడు రకాల బాండ్ల ద్వారా సుమారుగా రూ.8 వేల కోట్ల వరకూ సమీకరించాలని సీఆర్డీయే వర్గాలు భావిస్తున్నాయి. తొలివిడతకు లభించిన అనూహ్య స్పందనపై సిఆర్డీయే అధికారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
మోడీకంటే...బాండ్లే ఎక్కువ
అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ ఇచ్చినదానికంటే బాండ్ల ద్వారా వచ్చిందే ఎక్కవని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రం రాజధానికి రూ. 1500 కోట్లు ఇచ్చి ఏవేవో మాటలు చెబుతోందని ఎద్దేవా చేశారు. బాండ్ల ద్వారా గంటలో రూ.2 వేల కోట్లు రావడం చంద్రబాబు పై ప్రజల నమ్మకానికి నిదర్వనం అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి అమరావతికి సాయం చేస్తే జనం మెచ్చుకుంటారని, లేకుంటే ఛీ కొడతారని హెచ్చరించారు.
చంద్రబాబు...ఇలా అన్నారు
ఇటీవల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన జపాన్ రాయబారి కెంజీ హిరమత్సు సిఎం చంద్రబాబుతో మాట్లాడుతూ... ‘మీరు కేంద్రంలోని అధికార కూటమితో విభేదించి విడిపోయారు. విడిపోయి మనగలరా? మీకు నిధులెలా వస్తాయి? ప్రాజెక్టులు ఎలా వస్తాయి?'...అని ప్రశ్నించారట. అందుకు చంద్రబాబు సమాధానమిస్తూ ‘‘నవ్యాంధ్రప్రదేశ్ తనకు తాను బ్రాండ్ ఇమేజి సృష్టించుకుంది...కేంద్ర సహాయం లేకపోయినా నిలదొక్కుకోగల స్థితికి వచ్చింది''...అన్నారట. అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన నేపథ్యంలో టిడిపి నేతలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేస్తున్నారు.
గ్యారంటీ...గెలుపుపై సిఎం
అమరావతి బాండ్లలో పెట్టుబడి పెట్టదల్చుకొన్న సంస్థలు కొన్ని ముందుగానే ఇక్కడకు వచ్చి...సీఆర్డీయే చెబుతున్నట్లుగా పనులు జరుగుతున్నాయా?... అభివృద్ధి జరిగే అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించాయట. ఇక కొన్ని సంస్థల ప్రతినిధులలైతే ఏకంగా సిఎం చంద్రబాబును కలిసి...‘‘సార్... మీ ఆలోచనలు, ప్రణాళికలు చాలా బాగున్నాయి...కానీ, రేపు ఎన్నికల్లో మీరు గెలవకపోతే మా పెట్టుబడులు ఏమవుతాయి?...మాకు గ్యారంటీ ఏమిటి'' అని ప్రశ్నించారట. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు...‘‘మా గెలుపుపై ఒక్క శాతం కూడా అనుమానం లేదు. ఎవరు వచ్చినప్పటికీ అమరావతి అభివృద్ధిని ఆపలేని స్ధాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం''...అని ధీమా వ్యక్తం చేశారట.
మరిన్ని బాండ్లు...మూడు రూపాల్లో...
అమరావతి నిర్మాణం కోసం మొత్తం మూడు రకాల బాండ్ల ద్వారా సుమారుగా రూ.8 వేల కోట్ల వరకూ సమీకరించాలని సీఆర్డీయే భావిస్తోంది. ఈ బాండ్ల ద్వారా నిధుల సమీకరణకు ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డురావు. ప్రస్తుతం జారీ అయిన అమరావతి బాండ్లు ఈ నెల 27వ తేదీ నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ కానున్నాయి. ఇప్పుడు బాండ్లు కొన్న కంపెనీలు వాటిని తిరిగి అమ్ముకొనే అవకాశం దీని వల్ల కలుగుతుంది. తర్వాత దశలో చిన్న మదుపర్ల కోసం సీఆర్డీయే రిటైల్ బాండ్లను తీసుకురానుంది. మూడో దశలో విదేశీ ఇన్వెస్టర్ల కోసం మసాలా బాండ్లు విడుదల చేస్తారు. మరోవైపు రాబోయే రోజుల్లో విశాఖ, విజయవాడ వంటి నగర పాలక సంస్థలు కూడా విడిగా బాండ్లు జారీ చేసి నిధులు సమకూర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.