సీమాంధ్రలో పవన్కళ్యాణ్, మోడీ జోరు: షర్మిల హుషారు
హైదరాబాద్: సీమాంధ్రలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కానిపిస్తోందా? అంటే అవుననే అంటున్నారు. సీమాంధ్రలో ఈ నెల 7వ తేదీన అసెంబ్లీకి, లోకసభకు ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ అలుపు లేకుండా టిడిపి, బిజెపి కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు. అలాగే మోడీ.. సీమాంధ్రలో ప్రచారం చేశారు.
పవన్, మోడీల జోరు సీమాంధ్రలో స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి, టిడిపి శ్రేణులు ఉత్సాహపడుతున్నాయి. పలు జిల్లాల్లో నాలుగు రోజులు క్రితం వరకు కాస్తంత బలహీనంగా కనిపించిన టిడిపి, బిజెపి కూటమి బాగా పుంజుకుందంటున్నారు. అభ్యర్ధుల ఎంపికతో పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలు, అసంతృప్తులతో ఇబ్బందికరమైన పరిస్థితికి దిగజారినప్పటికీ ఇప్పుడు ఉత్సాహంతో ఉందట.

మోడీ సీమాంధ్రలో సాగించిన ప్రచారం, పవన్ సుడిగాలి పర్యటన కూటమికి కొత్త బలాన్ని అందించాయంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో... మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు బిజెపిలో చేరడం ఆ జిల్లాలో మరింత కలిసి వస్తుందంటున్నారు. సీమాంధ్రలో తమ కూటమి గెలుపు ఖాయమనే ధీమలో టిడిపి, బిజెపి శ్రేణులు ఉన్నాయి.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అదే జోరులో ఉంది. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలకు తోడు షర్మిల ప్రచారంలో దూసుకెళ్తున్నారని, తమ పార్టీ ప్రభుత్వం ఖాయమని జగన్ పార్టీ చెబుతోంది.
తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. వందకు పైగా స్థానాలు గెలుపొందటం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రచారంలో భాగంగా జగన్, విజయమ్మల కంటే షర్మిలనే టిడిపి, బిజెపిల పైన ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ప్రసంగం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.












Click it and Unblock the Notifications