విశాఖలో టెక్కీ భర్త దారుణం, నాలుగేళ్లుగా జాడలేదు: అమెరికాలో ఉండొచ్చు
విశాఖపట్నం: విశాఖపట్నంలో దారుణం వెలుగు చూసింది. యువతిని పెళ్లి చేసుకొని, అమ్మాయి పుట్టిన తర్వాత భార్యను కాదని వెళ్లిన ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ నాలుగేళ్ల తర్వాత కూడా తిరిగి రాలేదు. ఈ సంఘటన విశాఖలోని విశాలాక్షిపురంలో చోటు చేసుకుంది.
నవాజ్ అనే సాఫ్టువేర్ ఇంజినీర్కు ఫాతిమాతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. 2013లో వారి పెళ్లయ్యాక కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఆమె డెలివరీ కోసం తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఆమెకు అమ్మాయిపుట్టింది. ఆ తర్వాత నుంచి భర్త అందుబాటులో లేడు.
అతను అమెరికా వెళ్లినట్లుగా భావిస్తున్నారు. పెళ్లి సమయంలో ఆయనకు పెద్ద ఎత్తున కట్నం ఇచ్చారని చెబుతున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఆ యువతికి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అమ్మాయి పుట్టిన కొద్ది రోజులకు అత్తింటి ఆమెను ఇంటికి రానివ్వలేదు. అప్పటికే భర్త అమెరికా వెళ్లిపోయారు.
ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. కానీ భర్త నవాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియక చేతులెత్తేశారని తెలుస్తోంది. ఫాతిమా కూడా నాలుగేళ్లుగా ఆయన కోసం వేచి చూస్తోంది. కానీ ఇంత వరకు అతని జాడ లేదు. కానీ అమెరికా వెళ్లినట్లుగా భావిస్తున్నారు.