బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం: మేళతాళల మధ్య బోనమెత్తిన భక్తులు
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం తీసుకొచ్చారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బంగారు పాత్రలో బోనం సమర్పించుకున్నారు. మీరాలం మండి గుండి ఛైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ బోనం తెచ్చారు.
హైదరాబాద్ పాతబస్తీలో వెలసిన మహంకాళీ అమ్మవారి ఆలయం నుంచి ఏటా సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా వరుసగా 12వ ఏట తెలంగాణ నుంచి బోనాలు సమర్పించేందుకు భక్తులు విజయవాడకు వచ్చారు.

మేళతాళాల మధ్య భోనాన్ని ఎత్తుకున్న భక్తులు ఆనంద తాండవం చేశారు. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ కార్యక్రమంలో 250 మంది భక్తులు మాత్రమే పాల్గొనడానికి అనుమతిచ్చారు. ఈ సందర్భంగా దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది.
Recommended Video
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారిని తరిమేయాలని భక్తులు మొక్కుకున్నారు. వర్షాలు బాగా పడి, పంటలు పండాలని కోరుకున్నారు. పోతరాజులు చిందేశారు. కాగా, జులై 30న కనక దుర్గమ్మ ఆలయం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్లో వెలసిన అమ్మవార్లకు బోనం తీసుకెళ్లనున్నారు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ ఘనంగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications