ఊహించరు: హైద్రాబాద్పై కేసీఆర్, తుమ్మల ముహూర్తం
హైదరాబాద్: హైదరాబాదులో అభివృద్ధి జరగాల్సిన స్థాయిలో జరగలేదని, తాము ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు. హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటైన క్రెడాయి ప్రాపర్టీ షోను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
అవినీతిని జీరో స్థాయికి చేసి చూపిస్తామన్నారు. కొన్నేళ్లలో హైదరాబాదు ఊహించనంతగా అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో హైదరాబాదులో రియల్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రోడ్లు వేస్తామన్నారు.
సింగపూర్లాంటి దేశాల్లో అవినీతి ఉండదన్నారు. కానీ, మన సమాజంలో అతి పెద్ద జబ్బు లంచమని, అవినీతిరహిత తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తామన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాలకు హైదరాబాదు అనువైన ప్రాంతమని, హైదరాబాదు లాంటి వాతావరణం దేశంలో మరెక్కడా ఉండదన్నారు.
ఇక్కడ పని చేసి రిటైరైన ఉద్యోగులు హైదరాబాదును విడిచి వెళ్లరన్నారు. హైదరాబాదులో భూకంపాలు రావన్నారు. హైదరాబాదులో త్వరలో నాలా పన్నును ఎత్తివేస్తామన్నారు. హైదరాబాద్ వంటి వాతావరణం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. నిర్మాణ రంగానికి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, మంత్రి పద్మారావులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ షో కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
తెరాసలోకి తుమ్మల ముహూర్తం ఖరారు
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర రావు తెరాసలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారయ్యింది. సెప్టెంబర్ 5వ తారీఖున కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమం ద్వారా ఆయన కారు ఎక్కనున్నారు. సుమారు 2వేల వాహనాల భారీ కాన్వాయ్తో వేలాదిమంది అనుచరులతో ఆయన తెరాసలో చేరనున్నారు.