తమాషానా, లోపలేయిస్తా: కేసీఆర్కు కోపమొచ్చింది
హైదరాబాద్: పేకాట క్లబ్బులను తెరిపించాలని మాట్లాడితే లోపలేయిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఘాటుగా హెచ్చరించారు. హైదరాబాదులోని తెరాస భవన్లో ఫ్యామిలీ క్లబ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కేసీఆర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేకాట క్లబ్బుల గురించి తనకు బాగా తెలుసునని, యజమానుల తరఫున మీరు వకాల్తా తీసుకుంటారా? క్లబ్బులను తెరిపించాలని నా వద్దకు మరోసారి నా వద్దకు వస్తే మీ అందర్నీ లోపలేయిస్తా.. జాగ్రత్త అని హెచ్చరించారు.
కేసీఆర్ తెలంగాణ భవన్లో మెదక్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం బయటకు వస్తుండగా ట్విన్ సిటీస్ ఫ్యామిలీ క్లబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొందరు వచ్చారు.
కేసీఆర్ వాహనం ఎక్కబోతుండగా ఎదురెళ్లారు. క్లబ్బులను తెరిపించాలని కోరారు. పేకాట ఆడే వారు ఎక్కడైనా ఆడతారని, జంట నగరాల్లో క్లబ్బులను మూసివేయడంతో భీమవరం, నూజివీడు, కొలంబో, గోవా, చెన్నై, బెంగళూరు, తదితర ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పారు.
వారి చెప్పిన విషయాలను ఓపికగా విన్న కేసీఆర్.. క్లబ్బులను తెరిపించాలని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేయవద్దన్నారు. ఎక్కడైనా మంచి పని చేసుకొని బతకాలని, క్లబ్బులు మంచివి కావని, క్లబ్బుల యాజమాన్యాల తరఫున వచ్చారా అని నిలదీశారు. పోలీసులు వారిని అక్కడి నుండి పంపించారు.