ఇడుపులపాయలో తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా? అనేది తేలుతుంది. అప్పటివరకు తెలంగాణలో ఎవరి రాజకీయ కార్యకలాపాల్లో వారు మునిగిపోయారు.

యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.
ఈ పరిణామాల మధ్య తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. కడప జిల్లాలో ప్రత్యక్షం అయ్యారు. ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ను సందర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళి అర్పించారు. సమాధిపై పూలమాలలు ఉంచి మౌనం పాటించారు. భట్టి విక్రమార్క వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అనుచరులు ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్కు ముఖ్య అనుచరుడిగా పేరుంది మల్లు భట్టి విక్రమార్కకు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉన్న నేపథ్యంలో భట్టి- ఇడుపులపాయకు రావడం, వైఎస్సార్కు నివాళి అర్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications