నేడు రాష్ట్రానికి టీ డ్రాఫ్ బిల్లు?: నేడే ఎపికి డిగ్గీ
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లు గురువారం రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు ఫైల్పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు తెలుస్తోంది. హోం శాఖ నుంచి రేపు ఆ బిల్లు రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అభిప్రాయం చెప్పేందుకు అసెంబ్లీకి ఆరువారాల సమయం ఇవ్వనున్నారని సమాచారం. ఈ విషయంపై కేంద్ర హోం శాఖ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం.
అయితే, ఆ విషయం తమకేమీ తెలియదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కేంద్ర హోం శాఖ నుంచి ముసాయిదా బిల్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వస్తుంది. అక్కడి నుంచి అది ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తుంది. అక్కడి నుంచి గవర్నర్కు వెళ్తుంది. గవర్నర్ దాన్ని శాసనసభకు పంపిస్తారు.

కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే మరోసారి అసెంబ్లీ సలహా సంఘం (బిఎసి) సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు బుధవారం చెప్పారు. బిఎసి సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే శాసనసభకు తేవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు ఈటెల రాజేందర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తొమ్మిది మంది బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లు లోపాలను పరిశీలించాలని కోరారు. ఇదే సమయంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ రేపు గురువారం హైదరాబాదు రానున్నారు. నెల రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications