నంది అవార్డు పేరు మార్చనున్న తెలంగాణ, కేసీఆర్పై నాగం ఆగ్రహం
హైదరాబాద్: ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డు పేరును మార్చనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు కొత్త పేర్లను పరిశీలిస్తున్నారని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పేరిట అవార్డులను కొనసాగిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ తరఫున కళాకారులను ఘనంగా సత్కరిస్తామని ఆయన అన్నారు. టాలీవుడ్ సమస్యలు, అభివృద్ధిపై కేసీఆర్తో చర్చిస్తామన్నారు.
మా శాఖపై ప్రభావం
బంగారు తెలంగాణ నిర్మాణంలో వాణిజ్య, పన్నుల శాఖదే కీలక పాత్ర అని తలసాని వేరుగా అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడంతో దాని ప్రభావం తమ శాఖ పైన ఉంటుందన్నారు. నిజాయితీగా ఉన్న వ్యాపారులకు అండగా ఉంటామని, అనవసరంగా వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.
అధికారులు కూడా నిజాయితీగా పని చేయాల్సిన అవసరముందన్నారు. కొందరు వ్యాపారులు తక్కువ టర్నోవర్ చూపించి పన్నులు కట్టడం లేదన్నారు. హైదరాబాదులో ప్రతి నెల రూ.50వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని, అయితే దానికి తగ్గట్లు పన్నులు వసూలు కావడం లేదన్నారు.
కేసీఆర్పై నాగం మండిపాటు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ పాలన గాడి తప్పిందన్నారు. ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఓ వైపు రైతులకు, మరోవైపు ప్రజలకు శాపంగా మారాయన్నారు. గాలిలో తిరుగుతూ గాలి మాటలతో ప్రజలను ఊహల్లో విహరింప చేస్తున్నారన్నారు. తెలంగాణలో తీవ్రమైన కరువు ఉంటే దాని గురించి పట్టించుకోవడంలేదన్నారు.