'అమ్మాయిల్ని వేధిస్తే కళ్లు పీకేస్తాం': గల్ఫ్ తరహా చట్టం!
హైదరాబాద్: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మృగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. రాజధానిలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలను నిర్మూలించేందుకు నడుం బిగించింది. అందుకోసం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడవద్దని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తోంది.
అమ్మాయిల వెంటపడి, అల్లరి చేష్టలతో వేధింపులకు గురిచేస్తున్న అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. వేధింపులకు గురిచేస్తున్న వారి కళ్లు పీకేస్తామని, ఈ విషయంలో వివాదాస్పదమైనా వెనక్కి తగ్గేది లేదన్నారు.
ఆదివారం నుంచి ఒక్క నెల దాటిన తర్వాత హైదరాబాద్లో రౌడీలు, అల్లరి మూకలు ఆడపిల్లలకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుందన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కఠిన శిక్షలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అదేగనుక అమల్లోకి వస్తే దేశంలో కెసిఆర్ నిర్ణయం సంచలనం కానుంది.

కాగా ఢిల్లీ తర్వాత హైదరాబాద్లోనే మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల నిర్వహించిన పలు ప్రయివేట్ సర్వేలలో తేలింది. సర్వేల నివేదికలో జంట నగరాల్లో మహిళలు, కాలేజీకి వెళ్తున్న విద్యార్థినులపై వేధింపులు పెరిగిపోయాయి. దీంతో పోకిరీల వేధింపులు తాళలేక చాలామంది మహిళలు ఉద్యోగాలు, విద్యార్థినులు చదువులు మానేస్తున్నారు.
ముఖ్యంగా బస్టాప్లు, బస్సుల్లో, పర్యాటక కేంద్రాల వద్ద వేధింపులు ఎక్కువయ్యాయని వెల్లడైంది. దీనికితోడు మహిళల భద్రతను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాలు గాలికి వదిలేశాయంటూ మహిళ సంఘాలు పలు సందర్భాల్లో ధర్నాలకూ దిగాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలోనే మహిళల భద్రతపై ఏర్పడిన మచ్చను తుడిచివేయాలని కేసీఆర్ సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఆ దిశగా ఆలోచనలు, ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడే మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అందులో రాజీపడబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ మేరకే మహిళల భద్రత, రక్షణపై సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ దేశవ్యాప్తంగా గుజరాత్, కేరళ, గోవా వంటి రాష్ట్రాల్లో పర్యటించింది.
దాంతోపాటు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా జర్నలిస్టులతో చర్చించి, అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. త్వరలోనే కమిటీ సింగపూర్లోనూ పర్యటించనుంది. మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలంటే పలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ నివేదికను అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ కల్పించేందుకు గల్ఫ్ తరహా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
మహిళలు, అమ్మాయిలను వేధిస్తే సహించేది లేదని, నెల రోజుల తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారిపోతుందని, అల్లరి మూకల ఆగడాలను సహించమని, అందులో కళ్లు ఊడబీకే కార్యక్రమాలు కూడా ఉంటాయని, అందుకోసం ప్రత్యేక బిల్లును రూపొందిస్తున్నామని, వివాదాస్పదమైనా వెనకడుగు వేయమని కేసీఆర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బాధితుల ఫిర్యాదులను స్వీకరించేందుకు రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మహిళా పోలీసు స్టేషన్లతోపాటు మహిళా సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉంది.
దీంతో మగ పోలీసులే బాధితురాలి ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. దీనివల్ల అఘాయిత్యానికి గురైన మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వీటన్నింటి దృష్ట్యా రాష్ట్రంలో ముఖ్యంగా జంట నగరాల్లో మహిళా పోలీసుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది.












Click it and Unblock the Notifications