కిరణ్ ఢీకొడతారా, ఎదురు తిరిగితే: వారిని ఎగదోస్తుందా?
మొదటి నుండి సమైక్య గళం బలంగా వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీకి హాజరు అవుతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కిరణ్ను విభజనకు ఒప్పించాలని లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకొని అయినా సరే ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉందని చెబుతున్నారు.
ఢిల్లీలో సమన్వయ భేటీ జరపడం, ఆహ్వానించడం వెనుక మద్దతు కూడగట్టేందుకే అంటున్నారు. ఆకస్మికంగా సమావేశం ఏర్పాటు చేయడంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ భేటీలో ఇరు ప్రాంత నేతల మధ్య సమన్వయం పైన చర్చ జరగనుందని చెబుతున్నారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రికి కూడా విభజనపై నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు. అయితే మరోసారి ముఖ్యమంత్రి గట్టిగా తన సమైక్యవాదన వినిపించే అవకాశం లేకపోలేదంటున్నారు. అదే జరిగితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కిరణ్ను అధిష్టానం హెచ్చరించే అవకాశముందని, కాదు... కూడదంటే తీవ్ర నిర్ణయానికి వెనుకాడకపోవచ్చునని చెబుతున్నారు. సభలో బిల్లును తిరస్కరించే వరకు పదవిలో కొనసాగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తనను కలిసిన నేతలతో కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారట.
కిరణ్ జోరుకు కళ్లెం వేసేందుకు అధిష్టానం గవర్నర్ నరసింహన్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలంగాణ ప్రాంత మంత్రులను ఎగదోసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.