మద్దెల చెరువు సూరి హత్యకేసులో భానుకు యావజ్జీవం
మద్దెలచెరువు సూరి (గంగుల సూర్యనారాయణరెడ్డి) హత్య కేసులో నిందితుడైన భాను కిరణ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. పరిటాల రవి హత్య కేసులో సూరి నిందితుడు. 2011 జనవరిలో సూరి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భానుకు 2018 డిసెంబరులో కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దీనిపై భాను తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేశాడు.
భాను వేసిన పిటిషన్ పై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని భాను తరఫు లాయర్ వాదించారు. కేవలం ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే జైలు శిక్ష విధించారన్నారు. వారిద్దరూ అనుమానితులేనని, అయితే కింది న్యాయస్థానం దీన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. భాను పరారీలో ఉన్నాడు అన్న విషయాన్నే కోర్టు పరిగణనలోకి తీసుకుందని, గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను భాను తరఫు న్యాయవాది ప్రస్తావించారు. పిటిషనర్ రివాల్వర్, పిస్టల్ వినియోగించినట్లు నిరూపించలేదన్నారు.

పథకం ప్రకారమే భాను మద్దెలచెరువు సూరిని హత్య చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదించారు. హత్య జరిగిన రోజు సూరితోపాటు భాను కిరణ్ కారులో ప్రయాణిస్తున్నారని, సూరిని భాను వెనుక నుంచి కాల్చి చంపాడని తెలిపారు. హత్య జరిగిన తర్వాత భాను మధ్యప్రదేశ్ కు పారిపోయారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం భాను అప్పీలును కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. హైదరాబాద్లోని సనత్నగర్ నవోదయ కాలనీలో 2011 జనవరి 4వ తేదీన సూరిని భానుకిరణ్ కాల్చి చంపాడనే అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో భాను కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్లో భానుకిరణ్కు జీవితఖైదు ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications