పీవీపీకి ముందస్తు బెయిల్: విజయవాడలో ప్రత్యక్షం, సీఎం జగన్తో ముచ్చట్లు
హైదరాబాద్: వైయస్సార్సీపీ నేత పొట్టూరి వరప్రసాద్(పీవీపీ)కి హైకోర్టులో ఊరట లభిస్తుంది. విల్లా యజమానిపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పీవీపీ.
మళ్లీ విచారణకు వైసీపీ నేత పీవీపీ డుమ్మా.. సీఎం జగన్ సరికొత్త ఎత్తుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు..
పీవీపీకి బెయిల్ మంజూరు
ఈ క్రమంలో బుధవారం దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పీవీపీ బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.
దౌర్జన్యం చేశారని కేసు నమోదు..
కాగా, గత వారం పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.తన ఇంటి భాగంలో నిర్మిస్తోన్న రూఫ్ గార్డెన్ను అడ్డుకున్నారని, పీవీపీ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని కైలాష్ అనే వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేశారు.
పోలీసులపైకి కుక్కలు వదలడంతో..
ఈ నేపథ్యంలో తొలి రోజు విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పీవీపీ మరుసటి రోజు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో విచారణ కోసం పోలీసులే పీవీపీ నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపై తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. దీంతో కంగుతిన్న పోలీసులు.. అక్కడ్నుంచి తిరిగి వచ్చేశారు.
Recommended Video
విజయవాడలో పీవీపీ ప్రత్యక్షం.. సీఎం జగన్తో ముచ్చట్లు..
విచారణకు వెళ్లిన తమపైకి కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీశ్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఐసీపీ 353 కింద పీవీపీపై మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఇది ఇలావుంటే, బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీపీ పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముచ్చటిస్తూ కనిపించారు. కాగా, 1068 కొత్త వాహనాలను(104, 108) సీఎం జగన్ ఈరోజు ప్రారంభించిన విషయం తెలిసిందే.