రఘురామకు షాక్ -పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు : బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పుకు లైన్ క్లియర్..!!
ఎంపీ రఘురామ రాజుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో సీబీఐ కోర్టులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ రాజు పిటీషన్ దాఖలు చేసారు. ఆ తరువాత అదే తరహాలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విషయంలోనూ ఇదే తరహా పిటీషన్ దాఖలు చేసారు. ఈ రెండు పిటీషన్ల పైన సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీని పైన ఈ రోజు సీబీఐ కోర్టు తీర్పు కోసం రిజర్వ్ చేసింది. ఈ సమయంలో రఘురామ రాజు హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు.
సీబీఐ కోర్టు నుంచి బెయిల్ రద్దు పిటిషన్ను మరో న్యాయస్థానానికి మార్చాలని అందులో కోర్టును కోరారు. దీని పైన విచారించిన హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఇతర దేశాలకు వెళ్లటానికి అనుమతి ఇచ్చినంత మాత్రాన కోర్టులనే అనుమానిస్తారా అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత మాత్రాన కోర్టులను సందేహిస్తూ కేసు బదిలీ చేయాలని ఎలా కోరుతారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. తాము దాఖలు చేసిన కేసుల్లో విచారణ పారదర్శకంగా సాగటం లేదని..రోజు వారి విచారణ సాగాల్సి ఉన్నా..నిందితులు కోరిన విధంగా వాయిదాలు వేస్తున్నారని పేర్కొన్నారు.
ఇవన్నీ అనుమానాస్పందగా ఉన్నందున పిటీషన్లను వేరే బెంచ్ కు మార్చాలని రఘురామ కోరారు. ఆ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విజయ సాయి రెడ్డికి అనుమతి ఇచ్చిన సమయంలో హైకోర్టను ఆశ్రయించారా అని ప్రశ్నించారు. దానికి సీబీఐ న్యాయవాది లేదని సమాధానం ఇచ్చారు. లేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకుని ప్రశ్నిస్తూ.. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణం ఉండాలని, ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారన్నారు. దీంతో..దీనికి సంబంధించి ఉత్తర్వులను బుధవారం వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
Recommended Video
ఈ మేరకు కొద్ది సేపి క్రితం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ధాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు..పిటీషన్ కొట్టివేస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక, ఇప్పుడు హైకోర్టులో పిటీషన్ కొట్టివేయటంతో సీబీఐ కోర్టులో తీర్పు కు రూట్ క్లియర్ అయింది. ముందుగా చెప్పిన విధంగానే ఈ రోజు సీబీఐ కోర్టు సీఎం జగన్ - ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ లపైన తుది తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఈ తీర్పు పైన రాజకీయంగానూ..అధికార వర్గాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది.