ఎందుకు?: టీ సర్వేపై కేంద్రం ఆరా, నివేదిక ఇవ్వాలని..
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర సర్వేపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర సర్వేపై పలువురు పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సర్వేపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
సర్వే లక్ష్యం, చట్టబద్దతపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి లేఖ రాశారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదే అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఉమ్మడి రాజధానితో పాటు, ఉమ్మడి గవర్నర్గా ఒక్కరే కొనసాగుతున్నారని ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం తప్పనిసరి అన్నారు.
భారత దేశంలో ఏ పౌరుడి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు వచ్చినా దానిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అందులో భాగంగా సమగ్ర సర్వేపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఆధారంగా సమగ్ర సర్వేపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్రం భావిస్తోంది.
కాగా, తెలంగాణ రాష్ట్ర సర్వే న్యాయబద్దమా, కాదా అనే అంశంపై కేంద్రం దృష్టి సారించింది. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీలు ఫిర్యాదు చేయడంతో సర్వే పైన ఆరా తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే సర్వేకు చట్టబద్దత లేదని, అప్రజాస్వామికమని పలు పార్టీలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.