తెలంగాణ బలాలు: టిడిపికి నష్టం, బిజెపికి లాభం
రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనుసరించిన వైఖరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చాలా వరకు దెబ్బ తీసింది. ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ, తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చినప్పటికీ తెలంగాణలో అది బలాన్ని కోల్పోతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 25కు తగ్గిపోయింది. 15 మందికి పైగా శానససభ్యులు తెరాసలో చేరారు.
అదే సమయంలో బిజెపి తెలంగాణ అనుకూల వైఖరి వల్ల బలాన్ని పుంజుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ రెండు శాసనసభా స్థానాలను గెలుచుకోగా, ఉప ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ నగారా సమితి తరఫున పోటీ చేసి గెలిచిన నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో చేరారు. దాంతో బిజెపి శాసనసభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది.
తెలంగాణ అనుకూల వైఖరి వల్లనే కాకుండా, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అనుకూలంగా వీస్తున్న పవనాల వల్ల బిజెపి బలం పుంజుకుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే, కాంగ్రెసు, తెరాసలను ఒంటరిగా ఎదుర్కునే బలాన్ని అది సంతరించుకోలేదనే అంచనాలు ఉన్నాయి. తెలుగుదేశం క్రమంగా సత్తాను కోల్పోయిందని కూడా అంటున్నారు. ఆ స్థితిలో కాంగ్రెసు, తెరాస ముఖాముఖి తలపడితే ఈ రెండు పార్టీలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అంచనాలు వేస్తున్నారు.
తెలంగాణలో ఒకప్పుడు బలీయమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం ఇప్పుడు బిజెపికి 45 దాకా శానససభా స్థానాలు, 8 లోకసభ స్థానాలు ఇచ్చి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడింది. తెలంగాణలో 119 శాసనసభా స్థానాలు, 17 లోకసభ స్థానాలున్నాయి. తాము కలిసి పోటీ చేస్తే తప్ప తెరాస, కాంగ్రెసు పార్టీలను ధీటుగా ఎదుర్కోలేమనే భావన బిజెపిలో కన్నా తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఉంది. దీంతో టిడిపి అనివార్యంగా బిజెపితో పొత్తుకు సిద్ధపడిందని అంటున్నారు. ఇరు పార్టీలు కలిస్తే తెరాసకు, కాంగ్రెసుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.