టీపై కాంగ్రెసు వ్యూహం: చంద్రబాబు, జగన్ కార్నర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజకీయంగా కాంగ్రెసు పార్టీ మాస్టర్ ప్లాన్ వేసినట్లే కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌లను కార్నర్ చేసే వ్యూహాన్ని రచించి, అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు వ్యూహంలో ఆ ఇద్దరు నాయకులు కూడా చిక్కుకున్నట్లే కనిపిస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా వారిని దెబ్బ తీయాలనే ఎత్తులు వేసినట్లు అర్థమవుతోంది.

తెలంగాణలో కూడా వైయస్ అభిమానం కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన ఉనికిని చాటుకుందనే భావన మొదటి నుంచీ వ్యక్తమవుతూ వచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే, అది పూర్తయిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందని, ఎన్నికల నాటికి తెలంగాణలో ఆ పార్టీలోకి వలసలు పెరుగుతాయని అంచనా వేస్తూ వచ్చారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు మారిపోయింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకుని ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. సీమాంధ్రలో చాంపియన్‌గా నిలువడానికే వైయస్ జగన్ సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్నారనేది స్పష్టం. అయితే, తెలంగాణలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాస్తా బలం ఉన్న కొండా సురేఖ వంటి నాయకులు పార్టీని వదిలేశారు. పార్టీలోకి వచ్చిన కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా తప్పుకున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో స్థానం లేదనే విషయం తేలిపోయిందని అంటున్నారు. తెలంగాణను వదిలేసుకోవడానికి సిద్ధపడే జగన్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేపట్టారనే మాట వినిపిస్తోంది.

జగన్ సమైక్యాంధ్ర ఆందోళనతో ఎక్కువగా ఇరకాటంలో పడింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తొలుత విభజనను అంగీకరించి, సీమాంధ్రకు ప్యాకేజీల గురించి మాట్లాడిన చంద్రబాబు క్రమంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించే దశకు చేరుకున్నారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూనే ఆయన విభజనను వ్యతిరేకిస్తున్నారనే భావన ఏర్పడింది. విభజన తీరును వ్యతిరేకిస్తున్నానని ఆయన అంటున్నారు. అయితే, అదును కోసం కాచుకుని కూర్చున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

YS Jagan

దాదాపు 12 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం సమయంలో దాని గురించి నోరు విప్పని చంద్రబాబు సీమాంధ్ర విషయంలో మాత్రం ఆందోళనలకు దిగుతున్నారని, చంద్రబాబు పక్కా సమైక్యవాది అని వారు వాదిస్తున్నారు. ఈ అభిప్రాయం తెలంగాణలో బలపడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలోని కొంత మంది నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.

సీమాంధ్రలో కాంగ్రెసు గల్లంతవుతుందని, వైయస్ జగన్ చంద్రబాబు మధ్య పోటీ ఉంటుందని భావిస్తూ వచ్చారు. అయితే, అదే స్థాయిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర చాంపియన్‌గా పేరు తెచ్చుకునేందుకు పోటీ పడుతున్నారు. వారిద్దరికి కిరణ్ కుమార్ రెడ్డి పోటీకి వస్తున్నారు. కాంగ్రెసులో ఉంటూనే ఆయన సీమాంధ్ర ప్రజలను కిరణ్ కుమార్ రెడ్డి ఆకట్టుకుంటారా, లేదా అనేది తేలాల్సి ఉంది.

సీమాంధ్రలో బహుముఖ పోటీని కాంగ్రెసు పార్టీ ఆహ్వానించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. ఎన్నికల తర్వాత అవసరమైతే వైయస్ జగన్‌తో కేంద్రంలో పొత్తుకు సిద్ధపడవచ్చునని కూడా అనుకుంటోంది. తెలంగాణలో తెరాస, కాంగ్రెసు పార్టీలు మాత్రమే పోటీలు ఉండే విధంగా వ్యూహర చన జరిగింది. తెలుగుదేశం పార్టీని మూడో స్థానానికి నెట్టడానికి వీలుగా తెరాస కాంగ్రెసులో విలీనం కాకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. తెరాస, కాంగ్రెసు ఎదురెదురుగా పార్టీలుగా పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏమైనా, కాంగ్రెసు రాజకీయంగా ప్రయోజనం పొందడానికి వీలుగా రాష్ట్ర విభజన వ్యూహాన్ని అమలు చేస్తోందనేది తెలిసిపోతూనే ఉన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+