TDP అంతర్గత సర్వే... ఎన్ని సీట్లంటే..?
రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తెలుగుదేశం పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. విజయావకాశాలున్న నియోజకవర్గాల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలని సూచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలుచుకున్న 23 నియోజకవర్గాల్లో తిరిగి గెలవడం ఖాయమేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడున్నవి కాకుండా.. మరో 79
గత ఎన్నికల్లో దక్కించుకున్న 23 సీట్లు కాకుండా ఎన్ని నియోజకవర్గాల్లో విజయం దక్కించుకోగలమనే అంశంపై ఆ పార్టీ అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు కొంచెం శ్రద్ధ పెడితే 79 నియోజకవర్గాలను సునాయాసంగా గెలుచుకోవచ్చని ఇందులో వెల్లడైంది. 23 నియోజకవర్గాలతోపాటు ఈ 79ని కలిపితే 102 నియోజకవర్గాల్లో గెలుపు తథ్యమని తేలింది.
ఈ నియోజకవర్గాలన్నీ గత ఎన్నికల్లో కేవలం వెయ్యి నుంచి 2వేల ఓట్ల తేడాతో చేజార్చుకున్నవేనని, కొంచెం శ్రమపడినా ఇవి టీడీపీ ఖాతాలో పడతాయని, ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా పనిచేయాలంటూ చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు ఉద్భోదించినట్లు సమాచారం.

మిగిలినవాటిలో హోరాహోరీ పోరు
ఈ 79 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి ఓట్లు సాధించాలనే లక్ష్యంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఐదుశాతం నుంచి ఎనిమిది శాతం వరకు అదనపు ఓట్లు పడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తోన్న నేతల నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టిపెట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం విజయం ఖాయమైన నియోజకవర్గాలతోపాటు చివరి నిముషంలో రాజకీయ వ్యూహాలను అవలంబించి ప్రత్యర్థి పార్టీలను నిలవరిస్తే మరో 45 నియోజకవర్గాల్లో గెలుపు సునాయాసంగా దక్కుతుందని టీడీపీ భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, పొత్తుల్లాంటివి ఈ 45 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని తేలింది. మిగిలిన నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నడుస్తుందని అంచనా వేస్తున్నారు.

పొత్తుల గురించి ఇప్పుడే ఎందుకులే?
పొత్తులు కుదిరితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగా మెరుగుపడుతుందని, అయితే పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరిగా వెళ్లినా ఘనవిజయం సాధించగలిగేలా పార్టీ ప్రణాళికలు రూపొందించుకుంటోంది. పార్టీ శ్రేణులు మాత్రం ఒంటరిగా వెళ్లాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు.
ముందుగా ప్రకటించిన అభ్యర్థులు, ఇన్ ఛార్జిలుగా ఉన్నవారు తమ పనితాము చేసుకుంటూ వెళ్లాలని బాబు ఆదేశించారు. గెలుపు వాకిట ముందు తెలుగుదేశం పార్టీ నిలబడిందని, నాయకులు, కార్యకర్తలు అనుసరించే విధానాలను బట్టి ఫలితాలు ఆధారపడివుంటాయని, ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వానికి తావులేకుండా వ్యవహరించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications