రేపటి నుంచి తెలుగు వాడకపోతే ఏపీలో జైలుశిక్ష... ఎందుకంటే?
ఆగస్టు 29వ తేదీ అంటే ప్రతి తెలుగువాడు పులకరించిపోయే రోజు. దేశభాషలందు తెలుగు లెస్స అని పొగడ్తలకు అర్హత పొందినా, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరు సంపాదించినా అది తెలుగు భాషకే చెల్లు. మనదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి. అటువంటి తెలుగు భాషకు తీపిగుర్తుగా ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తెలుగును ఉపయోగించకపోతే జైలు శిక్ష విధిస్తామనేది ఈ ఉత్తర్వుల్లోని సారాంశం. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను కుడా ఏర్పాటు చేయబోతున్నారు. పాలనా భాషగా తెలుగును అమలు చేయని వ్యవస్థలకు, అధికారులకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. అంతేకాదు దుకాణాలపై తెలుగులో పేర్లు లేకపోయినా జరిమానాతోపాటు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భాషను కాపాడేందుకే చర్యలు తీసుకోవాలంటూ కొద్దిరోజుల క్రితమే భాషాభిమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ఇకనుంచి తెలుగు భాషను అమలు చేయడంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మాతృభాషపై నిర్లక్ష్యం చూపొద్దంటూ సూచించింది.