పిచ్చోడి చేతిలో రాయిలా: కెసిఆర్పై రేవంత్, ఎర్రబెల్లి, జగన్పై దేవినేని ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తెలంగాణ మిగులు బడ్జెట్.. పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు.
కెసిఆర్ పాలన చూసి అమరవీరుల ఆత్మ క్షోభిస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పలకరించిన పాపాన పోలేదని, మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కితే నోరెందుకు విప్పలేదని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ వీడటంతో ఖమ్మం జిల్లాకు పట్టిన శని వదిలిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పనికొచ్చే పని చేయడం లేదు: రేవంత్
ప్రజలకు పనికి వచ్చే ఏ ఒక్క పని కూడా తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు చేయడం లేదని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము పాండవులమైతే.. టిఆర్ఎస్ నేతలు కౌరవులని ఆరోపించారు.
ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీలో చేరిన టిడిపి నేతలతో రాజీనామా చేయించాలన్నారు. టిఆర్ఎస్కు ధైర్యముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ పడాలని సవాల్ విసిరారు.
నాటకాలను ప్రజలు చూస్తున్నారు: జగన్పై దేవినేని ఫైర్
రైతులకు రుణమాఫీ చేయడం ద్రోహమా, నేరమా అని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ధర్నా చేయడం పైన దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో జగన్ నాటకాలను ప్రజలు చూశారన్నారు. పార్టీ నుండి జారిపోతున్న నేతలను కాపాడుకునేందుకు జగన్ ధర్నా చేశారన్నారు.
ధర్నాలో కార్యకర్తలు తప్ప రైతులు ఎవరైనా పాల్గొన్నారా అని ప్రశ్నించారు. రూ.16వేల కోట్ల లోటు ఉన్నా రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేశారని, పార్టీ కార్యాలయం ఎక్కడుందో జగన్ అడ్రస్ చెప్పాలన్నారు. కేసీఆర్, తెరాసపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.