పవన్! నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, మీపక్కనే ఉన్న వ్యక్తి గురించి తెలుసుకో: గౌతు, శిరీష ఆగ్రహం
శ్రీకాకుళం: జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కుటుంబంపై చేసిన ఆరోపణలపై టీడీపీ పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనపై పవన్ చేసిన ఆరోపణలను పట్టించుకోనని, నియోజకవర్గ ప్రజలకు తాను ఏమిటో తెలుసునని చెప్పారు.
Recommended Video

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్లుగా ఉందన్నారు. చదివే ముందు కనీసం గౌతు లచ్చన్న కుటుంబం గురించి తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు సరికాదన్నారు. చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పారు. తన కుమార్తె గౌతు శిరీష టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా అందరి ఆశీర్వాదాలతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆమె భర్త వెంకన్న చౌదరి ఆమెకు వెంట ఉంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారన్నారు.

మీ వెనుక ఉండే వ్యక్తుల చరిత్ర పరిశీలించండి
పలాస - కాశీబుగ్గలో జీడీ పరిశ్రమదారులు అందరూ జీఎస్టీ చెల్లించలేమని తమ వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడంతో తాము చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తే పవన్ ఎవరి చెప్పుడు మాటలో విని పలాస ప్రజలు అల్లుడికి ట్యాక్స్ కడుతున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. మీ వెనుక ఉండే వ్యక్తుల చరిత్ర ఒకసారి పరిశీలించి గౌతు కుటుంబంపై అభాండాలని వెనక్కి తీసుకోవాలన్నారు.

పవన్కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించా
తాను ఇప్పటికే పవన్కు సంజాయిషీ కోసం లీగల్ నోటీసులు పంపించానని గౌతు శివాజీ అన్నారు. మీ కుటుంబ సభ్యులపై నోరు జారీతే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. మీ పక్కనే నిల్చొన్న వ్యక్తి ఒకప్పుడు పురపాలక అధికారిపై దాడి, పేకాట కేసులో అరెస్టయిన సందర్భాల్లో అజ్ఞాతంలోకి వెళ్లి దాక్కున్నాడని మండిపడ్డారు. మీ పక్కనే ఉన్న నాయకుడి చరిత్ర తెలుసుకోవాలన్నారు.

పవన్ మాట్లాడే తీరు విడ్డూరంగా ఉందని గౌతు శిరీష
సమాజం మార్పుకు శ్రీకారం చుట్టిన గౌతు లచ్చన్న కుటుంబంపై పవన్ మాట్లాడే తీరు విడ్డూరంగా ఉందని గౌతు శిరీష అన్నారు. ప్రత్యేక హోదాయో మా అజెండా అని ప్రజాయాత్ర చేపట్టి, ఇక్కడ గౌతు కుటుంబంపై ఆరోపణలు విడ్డూరమన్నారు. దీనికి పవన్ సమాధానం చెప్పాలన్నారు. ఎవరైనా అభివృద్ధి చేసి చూపించి ఓట్లు అడుగుతారని, మీరు తలకిందులుగా తపస్సు చేసినా తన తండ్రి గౌతు శివాజీలా కాలేరన్నారు. తమ కుటుంబంపై వేసిన ఆరోపణలపై తమకు సమాధానం చెప్పకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు.

పసుపు నీళ్లతో శుభ్రం చేశారు
శివాజీ కుటుంబంపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బుధవారం సాయంత్రం టీడీపీ నాయకులు మహాత్ముల విగ్రహాలను శుభ్రం చేశారు. పలాస-టీడీపీ కార్యాలయం నుంచి పసుపు నీళ్ల ట్యాంకుతో కాశీబుగ్గ బస్టాండు ఆవరణలో ఉన్న అంబేడ్కర్, మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహలను ఆ నీళ్లతో శుభ్రం చేసి పూలదండలు వేశారు. నీళ్లు జల్లుతూ చీపుర్లతో శుభ్రంచేశారు. హిందూ, క్రైస్తవ సోదరులంతా ప్రార్థనలు చేశారు.

అల్లుడు ట్యాక్స్పై ఆగ్రహం
పవన్కు గౌతు శివాజీ లీగల్ నోటీసులు కూడా పంపిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్ విమర్శలు చేశారని దానికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గలో మంగళవారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ.. పలాస ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, పలాస ప్రజలకు అల్లుడు టాక్స్ పడుతోందని ఆరోపించారు. 'ఇటీవల జీఎస్టీ విన్నాం.. కాని పలాసలో మాత్రం అదనంగా అల్లుడు టాక్స్ కట్టాలట' అని పవన్ అన్నారు. పవన్ ఆరోపణలపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేశారంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications