టార్గెట్ జగన్! వైసీపీ వ్యూహానికి టిడిపి ప్రతివ్యూహం: బాబు ఆమోదం
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టనున్న 'గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్' కార్యక్రమానికి విరుగుడుగా తెలుగుదేశం పార్టీ ప్రతివ్యూహం సిద్ధం చేసింది. ప్రతిపక్షం తలపెట్టిన కార్యక్రమంపై ఎదురుదాడికి అధికారపక్షం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వంద ప్రశ్నలను సిద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ రూపొందించిన వంద ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళికి అధినేత చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు తెలిసింది.
మేనిఫెస్టోలో పెట్టిన 70 శాతం అంశాలను అమలు చేశామని, లెక్కలతో సహా వివరించాలని అధికార పార్టీ నిర్ణయించింది. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తున్నతీరును ప్రజలకు స్పష్టం చేయనున్నారు. ఎన్నికల హామీల అమలుపై చర్చకు సిద్ధమా అంటూ వైయస్సార్ కాంగ్రె పార్టీ సవాల్ చేసే విధంగా ఈ ప్రశ్నావళి రూపొందించినట్లు సమాచారం.

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న తీరుతోపాటు, అవినీతి నిర్ధారణ, తాజాగా ఈడీ ఆస్తుల జప్తు వంటి అంశాలపైనా ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపక్షం రావాలనే డిమాండ్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టి ఒత్తిడి పెంచాలని యోచిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై నమోదైన ఈడీ కేసులు, ఆస్తుల జప్తు గురించి జనాభిప్రాయం సేకరణకు కూడా తాము సిద్ధమనే సవాలును ఆ పార్టీ ముందుంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాగా, జులై 8న నుంచి గడప గడపకు వైయస్సార్సీపీ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతుతున్నామని ఆ పార్టీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎంకు వంద ప్రశ్నలు సంధించింది. చంద్రబాబు దగాకోరు విధానాలను ప్రజల్లో ఎండగడతామని పేర్కొంది.












Click it and Unblock the Notifications