రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని...దుర్గమ్మకు సారె సమర్పించారు!...ఎవరంటే?
విజయవాడ:నవ్యాంధ్ర ప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుతూ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల కుటుంబాలు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనక దుర్గమ్మకు సారె సమర్పించారు.
గుణదలలోని దేవస్థానం క్వార్టర్సు నుంచి గురువారం ప్రదర్శనగా బయలుదేరిన దేవస్థానం ఉద్యోగుల కుటుంబాలు అలాగే పాదయాత్రతో అమ్మవారి ఆలయం చేరుకుని సారె సమర్పించారు. అనంతరం పొంగళ్లను కూడా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు దేవస్థానం ఉద్యోగుల కుటుంబ సభ్యులు క్వార్టర్స్ వద్దనే అమ్మవారికి పూజాదికాలు నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పట్టువస్త్రాలు, పసుసు, కుంకుమ, కొబ్బరికాయ, పొంగళ్లను తీసుకొని వచ్చిన వారు పాత మెట్ల మార్గంలో మల్లికార్జున మహామండపంలోని దుర్గమ్మ ఉత్సవమూర్తి వద్ద సారెను దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబు, ఈవో పద్మలకు అందజేశారు. అలాగే దుర్గమ్మకు కృష్ణలంక కోదండ రామస్వామి కోలాట భజన బృందం ఆధ్వర్యంలో కూడా ఆషాఢమాస సారెను సమర్పించారు. వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రసాదాలను అందజేశారు. కోలాట భజన బృందానికి ఝాన్సీ, కృష్ణవేణి నేతృత్వం వహించారు.












Click it and Unblock the Notifications