వైసీపీకి 38... ! టీడీపీకి 35... ! 2014 సీన్ రిపీట్ కాబోతోందా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల పాలన పూర్తయింది. మరో ఏడాదిన్నరలోపే ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు 2019లో 23 సీట్లకు పరిమితమైన టీడీపీ.. ఈసారైనా అధికారం అందుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇరు పార్టీలు చేస్తున్న కసరత్తులో అసలు పరిస్ధితులు బయటికి వస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల వాస్తవ పరిస్ధితి అర్ధమవుతోంది. ఇదే పరిస్దితి కొనసాగితే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

వైసీపీకి 38 టెన్షన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తోంది. వేల కోట్లు ఇందుకోసం వెచ్చిస్తోంది. అభివృద్ధిని సైతం ఇందుకోసం పణంగా పెట్టేస్తోంది. అయినా రాష్ట్రంలోని 38 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్దితి బాగోలేదు. ఆయా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ అంచనాలకు తగినట్లుగా పనిచేయడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ రేపు గెలుస్తుందా లేదా అన్న టెన్షన్ జగన్ లో పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో నిన్న సమీక్ష నిర్వహించిన జగన్.. వచ్చే మార్చి నెలను డెడ్ లైన్ గా పెట్టేశారు. అప్పటిలోగా ప్రదర్శన మెరుగుపడకపోతే కొత్త అభ్యర్ధుల్ని ఎంపిక చేసుకుంటానని జగన్ సదరు ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసారు.

టీడీపీకి 35 టెన్షన్
మరోవైపు 2019లో 23 సీట్లకు పరిమితమైన టీడీపీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో వైసీపీకి మరో నలుగురు ఎమ్మెల్యేలను అనధికారికంగా సమర్పించుకుంది. దీంతో అసెంబ్లీలో టీడీపీ వాస్తవ బలం 19కి చేరిపోయింది. కానీ ఈ రెండేళ్లలో జనంలోకి విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ, బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ గతంతో పోలిస్తే మెరుగుపడింది.
గత ఎన్నికల తర్వాత బయటికి వచ్చేందుకు భయపడిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను జనంలోకి తీసుకురాగలిగింది. అయితే ఇంత జరిగినా ఓ 35 సీట్లలో మాత్రం టీడీపీకి ఇప్పటికీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లే లేరు. దీంతో ఈ 35 సీట్లలో టీడీపీ ఆశలు ఆవిరవుతాయా అన్న చర్చ కొనసాగుతోంది.

దాదాపు సేమ్ పరిస్ధితి?
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో వైసీపీ 38 సీట్లలో, టీడీపీ 35 సీట్లలో పరిస్దితులు మెరుగుపర్చుకోవాల్సి ఉంది. వీరిద్దరికీ కామన్ గా మిగిలున్న సమయం కేవలం 16 నెలలే. మరో నాలుగు నెలలు ఆగితే ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పరిణామాలు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో ఎవరికీ తెలియదు.
మరోవైపు కేంద్రం ప్రాపకం కోసం ఇరు పార్టీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చేతీర్పు ఎన్నో సమీకరణాల్ని మార్చబోతోంది. దీంతో ఈ 35-38 సీట్లు వైసీపీ, టీడీపీ ఇద్దరికీ కీలకంగా మారబోతున్నాయి. ఈ సీట్లు ఎటు మొగ్గుతాయో తేలకపోతే మాత్రం చివరి నిమిషం వరకూ ఇరుపార్టీలకు టెన్షన్ తప్పకపోవచ్చు.

2014 రిపీట్ అవుతుందా?
2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో వైసీపీ 67 స్ధానాలకు పరిమితం కాగా.. టీడీపీ 102 సీట్లు గెల్చుకుంది. వీరిద్దరి మధ్య సీట్ల తేడా 35 సీట్లు మాత్రమే. ఈ 35 సీట్లు అటు నుంచి ఇటు మొగ్గితే టీడీపీకి బదులు వైసీపీకి అధికారం దక్కి ఉండేది. అలా కాకపోవడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అవే 35 సీట్లు అవే రెండు పార్టీల్ని టెన్షన్ పెడుతున్నాయి. ఈ 35 సీట్లలో గెలుపు కోసం ఇరు పార్టీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఈసారి ఈ 35 సీట్లలో వైసీపీని కాదని టీడీపీని గెలిపిస్తారా లేక టీడీపీని కాదని మళ్లీ ఆ 35 వైసీపీవైపే మొగ్గుచూపుతాయా అన్నది తేలాల్సి ఉంది. ఇది తేలాలంటే మాత్రం సవాలక్ష సమీకరణాలు ఎదురుచూస్తున్నాయి. వాటికి సమాధానం దొరికితే ఈ 35 సీట్ల వ్యవహారానికి 2024లో ఓ లాజికల్ ఎండ్ లభించే అవకాశముంది.












Click it and Unblock the Notifications