అమరావతి పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత-తణుకులో వైసీపీ నిరసనలు-నల్లబెలూన్లు, ఫ్లెక్సీలతో..
అమరావతి పాదయాత్రలో ఇవాళ ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో యాత్ర కొనసాగుతున్నసమయంలో వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. యాత్ర సాగుతున్న మార్గంలో దారి పొడవునా నల్ల రంగులతో ఫ్లెక్సీలు పెట్టి, నల్ల బెలూన్లు ఎగరేసి వైసీపీ శ్రేణులు నిరసన కొనసాగించాయి. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
తణుకు నుంచి ఉండ్రాజవరం మార్గంలో అమరావతి పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. అటు అమరావతికి అనుకూలంగా రైతులు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా అమరావతి మహిళా రైతుల్ని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. దీంతో పోలీసులు రోప్ పార్టీగా ఏర్పడి వైసీపీ శ్రేణుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అమరావతి పాదయాత్రకు మద్దతుగా తణుకుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. యాత్రకు సంఘీభావం ప్రకటించారు. దీంతో స్ధానిక ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మూడు రాజధానుల నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఓ దశలో అమరావతి యాత్రను సైతం అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ కాసేపటికే జేఏసీ నేతలతో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపేశారు.












Click it and Unblock the Notifications