మోడీ అడిగారు: లోకేష్, చంద్రబాబు ప్లాన్ అర్థం చేసుకోవాలి: టీజీ వెంకటేష్
హైదరాబాద్/విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విజ్ఞప్తి మేరకు తాము బీజేపీ నేత, కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించామని టిడిపి యువనేత నారా లోకేష్ మంగళవారం అన్నారు.
సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభులు ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా లోకేష్, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, హరిబాబు, కళా వెంకట్రావు, టీజీ వెంకటేష్ తదితరులు మాట్లాడారు.
లోకేష్ మాట్లాడుతూ... మోడీ, షా విజ్ఞప్తి మేరకు సురేష్ ప్రభుకు అవకాశమిచ్చామన్నారు. టిడిపి, బీజేపీలు రాష్ట్రంలో, కేంద్రంలో కలిసే పని చేస్తాయన్నారు. రాయలసీమ నుంచి ఓ అభ్యర్థిని రాజ్యసభకు పంపించాలనే ఉద్దేశ్యంతోనే టీజీ వెంకటేష్కు అవకాశం కల్పించామన్నారు.
ఏపీ ప్రజల మనోభావాలను వీరు రాజ్యసభలో ప్రస్తావిస్తారని చెప్పారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి పోరాడారని చెప్పారు. సుజన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కష్టపడ్డారని తెలిపారు. అందుకే రాజ్యసభకు పంపిస్తున్నామన్నారు.
సురేష్ ప్రభు మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి చేయాల్సినదంతా చేస్తామని, ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
బాబు ప్లాన్ అర్థం చేసుకుంటే..: టిజి వెంకటేష్
ఏపీ నుంచి తమను ఎందుకు రాజ్యసభకు పంపిస్తున్నారో.. చంద్రబాబు ప్లాన్ అందరూ అర్థం చేసుకోవాలని టిజి వెంకటేష్ అన్నారు. విభజన నేపథ్యంలో ఏపీ ఇబ్బందులు పడుతోందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి ఇద్దరు కాదని, ఐదుగురు కేంద్రమంత్రులని చెప్పారు.
తెలుగు మాట్లాడే, తెలుగువాడైన వెంకయ్య, రాష్ట్రానికి కోడలు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, ఇప్పుడు సురేష్ ప్రభు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్లాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
ఏపీ విభజన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తారని చెప్పారు. రాజకీయాల్లో లోకేష్ యాక్టివ్ అయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామన్నారు. తాను తొలుత టిడిపి బిడ్డనేనని చెప్పారు. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు.
టిడిపి - బిజెపి మిత్రపక్షం: సుజనా
సుజన, జాతీయ భావాలతో అన్న ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు పార్టీ ఎదగడానికి కృషి చేశారన్నారు. తనకు చంద్రబాబు రెండోసారి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా మరింత బాధ్యత పెంచారన్నారు. టిడిపి సిద్ధాంతాల ప్రకారం, చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు.
తెలుగు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యసభలో పని చేస్తామన్నారు. టిడిపి - బిజెపి మిత్రపక్షాలని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. మేం చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకొని.. ఏపీకి ఇచ్చిన హామీలు సాధిస్తామని చెప్పారు. బీజేపీతో కలిసి నడుస్తామని చెప్పారు.