ఢిల్లీలో అప్పుల పంచాయితీ - బుగ్గన ప్రయత్నాలు : కేంద్రం అనుమతి ఇచ్చేనా..!!
ఏపీ ప్రభుత్వం ఆర్దిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఒక వైపు తగ్గిపోయిన ఆదాయం..మరో వైపు సంక్షేమ పథకాల భారంతో ఆర్దిక నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. కరోనా దెబ్బతో భారీగా కుదేలైన ఏపీ ఆర్దిక వ్యవస్థ నిర్వహణకు ఇప్పుడు అప్పులే అవసరాలు తీర్చే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం సహకారంతో అప్పులు తెచ్చుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రూ పది వేల కోట్ల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం నిర్వహణ కోసం ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం ఢిల్లీలో కేంద్రం సహకారం కోరుతోంది.

మరో పది వేల కోట్లు రుణం కోసం ప్రయత్నాలు
రెండు నెలల క్రితం ఇచ్చిన రూ.10,500 కోట్లు, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ బ్యాంకులతో చేసుకున్న రూ.25,000కోట్ల అప్పుల ఒప్పందంలో మిగిలిన రూ.3,500 కోట్లు, మూలధన వ్యయ కోటా కింద కేంద్రం అదనంగా ఇచ్చిన రూ.2,650 కోట్లలో రూ.1,000 కోట్లను ఈ రెండు నెలల్లో అప్పు తీసుకొచ్చారు. సెప్టెంబరు, అ క్టోబరు నెలల్లో రూ.14,500 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. కేంద్రం ఇచ్చిన అనుమతిలో ఇంకా రూ.1,150 కోట్లు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి నాలుగున్నర నెలల సమయం ఉంది.

ఈ ఆర్దిక సంవత్సరం గట్టెక్కాలంటే
ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇవ్వడానికే నెలకు సగటున రూ.7,000 కోట్ల అప్పు చేస్తున్న ప్రభుత్వానికి మిగిలిన నాలుగున్నర నెలలు గడవడానికి రూ.1,150 కోట్ల అప్పు ఏ మూలకూ చాలదు. అందుకే ఇంకో రూ.10,000 కోట్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా సమాచారం. ఏపీకి అదనంగా రూ.10,500 కోట్ల కొత్త అప్పునకు అనుమతిస్తూ సెప్టెంబరు 3న కేంద్రం లేఖ రాసింది. ఇప్పుడూ అదే తరహాలో మళ్లీ కొత్త అప్పుల అనుమతి కోసం ఢిల్లీలో తిరుగుతున్నారు. కాగా, మంగళవారం ఆర్బీఐ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి 7శాతం వడ్డీకి రూ.1,000 కోట్లు అప్పు తెచ్చారు.

తాజాగా ఆర్బీఐ నుంచి వెయ్యి కోట్లు
నవంబరు 1న కూడా రూ.1,000కోట్లు తెచ్చింది. అంటే నవంబరులో ఆర్బీఐ ద్వారా రూ2,000 కోట్ల అప్పు తెచ్చింది. అయితే, ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ తో పాటుగా పెండింగ్ డీఏల కోసం ఒత్తిడి పెరుగుతోంది. దీని పైన ముందుగా ఒక ప్రకటన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఆర్దికంగా ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వాలన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది.
Recommended Video

జగన్ ప్రభుత్వం పై రాజకీయ ఒత్తిడి
ఇదే సమయంలో రాజకీయంగానూ బీజేపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇక, డిసెంబర్ మాసంలో సంక్షేమ పధకాల అమలు చేయాల్సి ఉంది. దీని కోసం నిధులు కావాలి. దీంతో..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రత్యేక అనుమతుల కోసం వెయిట్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం పది వేల కోట్లకు అనుమతి ఇస్తే ప్రస్తుత ఆర్దిక సంవత్సరం లో ఏపీ ప్రభుత్వానికి కొంత మేర ఉపశమనం కలగనుంది.












Click it and Unblock the Notifications