చట్ట సభల్లో వాడే భాష సంస్కారవంతంగా ఉండాలి.!చంద్రబాబుకు ఎంపీ వైయస్ చౌదరి సంఘీభావం.!
అమరావతి/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు దేశ వ్యాప్తంగా సంఘీభావం పెరుగుతోంది. వ్యక్తిగత ఆరోపణలు చేయడం ముమ్మాటికీ తప్పేనంటూ, చంద్రబాబు కుటుంబం గురించి శాసన సభలో ప్రస్థావించడం ముమ్మాటికీ తప్పేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు సభ్యులు విపక్ష నేతను వ్యక్తి గతంగా టార్గెట్ చేసి, ఆయన కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడడం క్షమార్హం కాదని, సభా నాయకుడిగా వున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించడం తగదని రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలపై వుండాలి గానీ, ప్రస్తుతం వ్యక్తులను దాటకుని, కుటుంబ సభ్యుల వరకు వెళ్లడం మంచి సంప్రదాయం కాదని సుజనా చౌదరి అభిప్రాయ పడ్డారు.
Recommended Video
ఏపీ శాసన సభలో సభ్యులు వ్యవహరించిన తీరు సరైన విధానం కాదని, ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేనని సుజనా చౌదని పేర్కొన్నారు. ఉన్నత విలువలతో, సంస్కారవంతమైన భాషతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయమన్నారు రాజ్యసభ ఎంపీ. రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివేచన కలిగినవారంతా ఇలాంటి ఘటనలను ఖండించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వం లేని నేలబారు నేతలను చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయని, మన పిల్లల కోసం మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే దిగజారుడు నేతలను దూరం పెట్టాలని, లేదంటే భవిష్యత్తు తరాలు రాజకీయనాయకులన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా అసహ్యించుకునే ప్రమాదం వుందని, కాబట్టి పార్టీలకు అతీతంగా నేతలంతా రాజకీయాల్లో విలువలను కాపాడేందుకు ప్రయత్నించాలని సుజనా చౌదరి విజ్ఞప్తి చేసారు.