లడ్డూ వివాదం, వైసీపీకి ఎమ్మెల్యేలు ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటే రండి
తిరుమల శ్రీవారికి, తిరుమల లడ్డూ ప్రసాదాలకు చెడ్డ పేరు తీసుకురావాలని ఉద్దేశంతోనే తిరుమల లడ్డూలు తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రయత్నించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు హెచ్చరించారు.
శనివారం తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ జరగడం చాలా బాధాకరమని, తాను తిరుపతి ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఇలాంటి వార్తలు బయటకు రావడం తనను ఎంతగానో కలిచివేసిందని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు విచారం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూల తయారీలో ఇలా నెయ్యి కల్తీ జరగడం వలన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అన్నారు.

ల్యాబ్ పరీక్షల అనంతరమే కల్తీ నెయ్యిపై టీటీడీ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారని, ఈ అంశాన్ని వైసీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. నిజా నిజాలు బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న ఇలాంటి వైసీపీ నాయకులను చూస్తుంటే ప్రజలు మండిపడుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అన్నారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ శ్రీవారి లడ్డులను తిరుమల భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, తిరుమల ప్రసాదాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తిరుమల లడ్డు పవిత్రపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే స్పష్టమైన ఆధారాలతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గుర్తు చేశారు.

గతంలో విజయ డైరీ నుండి తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి కొనుగోలు చేశారని, విజయ డైరీ మూతపడిన తర్వాతనే కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి వినియోగిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గుర్తు చేశారు. తమ స్వార్థ రాజకీయాలకు వైసీపీ నాయకులు తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకున్నారని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు.
చివరికి శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి కూడా కొనుగోలు చేసిన వైసీపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని పులివర్తి నాని మండిపడ్డారు. గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డి ఢిల్లీ లాబీయింగ్ కోసం తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేస్తామని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ తిరుమల ఆలయం విషయంలో చట్టం కన్నా ధర్మం చాలా గొప్పదని, అగమ శాస్త్ర నియమాలు కనుగుణంగా తిరుమలలో కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. శ్రీవారి లడ్డులను తిరుమల భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారని, అలాంటి శ్రీవారి లడ్డూల విషయంలోనే వైసీపీ నాయకులు రాజకీయాలు చేశారని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి కల్తీ నెయ్యి కొనుగోలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళిమోహన్ ఆరోపించారు.

ల్యాబ్ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతుంటే వాటికి కూడా రాజకీయాలను ఆపాదిస్తున్నారా అంటూ టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ వైసీపీ నాయకులు ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు టీటీడీ చైర్మన్లుగా ఉన్న సమయంలో తప్పు జరగలేదని మీరంత నమ్మకంగా ఉంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారని, మేము తప్పు చేయలేదని మీరు ధైర్యంగా ఉంటే విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.
గత టీటీడీ పాలకమండిలో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేయాలని చర్చ జరిగిన తర్వాత కొందరు వైసీపీ నాయకుల ఒత్తిడితో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేశారని తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నాయకులకు సవాలు విసరడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications