చనిపోవడానికి అనుమతిప్పించండి..
Guntur:కన్న బిడ్డలే కాలయముడిలా తయారయ్యారని తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ 85 ఏళ్ల వృద్ధుడు గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు.
లాలి పోసి జోల పాడినందుకు ప్రతిరోజు కొడుతున్నారు.. ముద్దుముద్దుగా పెంచి పెద్దచేసినందుకు ప్రత్యక్ష నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.. బుడిబుడి అడుగులను చేయి పట్టి పెద్ద పెద్ద అడుగులుగా మార్చి లోకాన్ని పరిచయం చేసినందుకు ఇప్పుడు ఆ లోకం నుంచే వెళ్లిపోయేలా చేస్తున్నారు. ఆస్తుల కోసం, డబ్బుల కోసం కన్న తండ్రికి బతికుండగానే నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఆస్తులు పంచి డబ్బులివ్వాలంటూ జాలి, దయ లేకుండా విచక్షణా రహితంగా ఆ 85 సంవత్సరాల వృద్ధుణ్ని ప్రతిరోజు తీవ్రంగా కొడుతున్నారు. సర్దిచెప్పడానికి ఇరుగు పొరుగు వస్తే వారిని కూడా బెదిరించి దౌర్జన్యం చేస్తున్నారు. కన్నబిడ్డలే కాలయముళ్లవడంతో చనిపోవడానికి అనుమతిప్పించడి అంటూ ఓ తండ్రి గుంటూరు పోలీసులను ఆశ్రయించాడు. వారు పెట్టే బాధలను తట్టుకోలేకపోతున్నాను.. చచ్చిపోతానికి అనుమతిప్పించండి అంటూ వేడుకున్నాడు.
గుంటూరులో పొగాకు, బంగారం వ్యాపారం చేసిన మహబూబ్ ఖాన్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య మరణించిన తర్వాత మహబూబ్ ఖాన్ ఒక్కడే మిగిలాడు. అతను చేసిన తప్పేమిటంటే.. పిల్లలకు ఆస్తులు పంచకపోవడం. వాటిని పంచి డబ్బులివ్వాలని, నీకు ఎక్కడికిపోయినా ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నాడని ఖాన్ వెల్లడించారు. కొడుకులవల్ల తన కుమార్తె కూడా ఇబ్బందులు పడుతోందని తెలిపాడు.
గుంటూరు: చచ్చిపోతాను అనుమతివ్వండి.. కన్నబిడ్డలే ఆస్తి కోసం కొడుతున్నారు pic.twitter.com/leTAUQv9xG
— oneindiatelugu (@oneindiatelugu) January 24, 2023
స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మహబూబ్ ఖాన్ ఫిర్యాదు చేశారు. బంగారం వ్యాపారం చేసే రోజుల్లో ఇతర దేశాల్లో ఉండేవారు కూడా తన దగ్గరకు వచ్చి బంగారం కొనుగోలు చేసేవారని, నిజాయితీగా వ్యాపారం చేశానని, ఇప్పటికీ ఖాతాదారులంతా విదేశాల నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంటారని వివరించాడు. నిజాయితీగా బతికినందుకు చివరి రోజుల్లో తనకీ దుస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.