నెల్లూరు కోర్టులో దొంగలు పడ్డారు - మంత్రి వర్సస్ మాజీ మంత్రి కేసు పత్రాలు చోరి : సంచలనంగా..!!
కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న నెల్లూరులో..ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారు. గురువారం ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన కోర్టు సిబ్బంది జిల్లా న్యాయమూర్తికి సమాచారం ఇవ్వటం..పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు మొదలైంది. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కొందరు వ్యక్తులు చొరబడ్డారు.
కోర్టులో ఆ కేసుకు సంబంధించినమే
దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, చోరీకి గురైన వాటిలో కొన్ని పత్రాలను..కోర్టు ప్రాంగణంలోనే పడేసారు. ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా గుర్తించారు.
కాకాని గోవర్ధన్ వర్సస్ సోమిరెడ్డి
మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి 2017 డిసెంబరులో ఆరోపించారు. ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లంటూ కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ స్టేషన్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. కాకాణి విడుదల చేసినవి నకిలీ పత్రాలుగా ధ్రువీకరించి చార్జిషీటు దాఖలుచేశారు. ఆయన్ను ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు.
నకీలీ పత్రాలంటూ ఆరోపణ.. పోలీసుల విచారణ
నకిలీ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ (ఏ-2), మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ (పాస్పోర్టు ప్రకారం) ఆ కేసులో నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు లభ్యమైన పత్రాలు చిరంజీవికి చెందినవని గుర్తించినట్లు తెలుస్తోంది. కోర్టు విషయంతో పాటు.. కీలక కేసుతో సంబంధం ఉండటంతో పోలీసులు లోతుగా ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ చేస్తున్నారు.