అప్పట్లో తల్లి వ్యాఖ్యల బాధితుడిగా వైఎస్సార్ -ఇప్పుడు జగన్-టీడీపీ రాజకీయమా మజాకా ?
ఏపీలో రాజకీయాలు నానాటికీ పతనం అవుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే దానికి స్పందించి ప్రతి విమర్శలు చేయడం ద్వారా వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించే వారు. కానీ కొన్నేళ్లుగా రాజకీయాల తీరు మారిపోయింది. ముఖ్యంగా దూషణల పర్వం మితిమీరింది. అదీ తల్లుల్ని దూషించుకునే స్ధాయికి చేరిపోయింది. అవాంఛనీయ పద ప్రయోగాలతో ప్రత్యర్ధులపై నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయితే విచిత్రంగా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొని మాజీ సీఎం వైఎస్సార్ బాధితుడిగా మారగా..ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కూడా బాధితుడిగా మారిపోతున్నారు.

ఏపీ రాజకీయాల పతనావస్ధ
ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ పతనం అవుతున్నాయి. ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు నేతలు, పార్టీలు ఎంచుకుంటున్న మార్గాలు అంతిమంగా దూషణలకు, దాడులకు దారి తీస్తున్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్న సామెతను నేతలు ఉద్ధేశపూర్వకంగా పక్కనబెట్టేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. ఇవి అంతిమంగా ప్రజలకు వినేందుకు సైతం కంపరం పుట్టిస్తున్నాయి. జనాలు ఏమనుకుంటారన్న విషయం కూడా మర్చిపోయి నేతలు చెలరేగిపోతున్న తీరు... భవిష్యత్తుపై ఆందోళన రేపుతోంది.

కొడాలి, పేర్నిల బూతు పంచాంగం
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచే ఆ పార్టీ నేత, ప్రస్తుత మంత్రి కొడాలి నానికి నోటి దురుసు ఎక్కువ. ప్రత్యర్ధులపై ముఖ్యంగా గతంలో తాను పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేరెత్తితేనే కొడాలి ఆగ్రహంతో ఊగిపోతుంటారు. అలవోకగా వీరిద్దరినీ బూతులు తిడుతూ హల్ చల్ చేస్తుంటారు. కొడాలి కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసే తీరు చూస్తే ఆయనకు ఈ విషయంలో ఉన్న క్రేజ్ ఎంతో అర్ధమవుతుంది. తాజాగా ఇదే కోవలో మరో మంత్రి పేర్ని నాని కూడా పవన్ కళ్యాణ్ తో వివాదంలో బూతు పంచాంగం విప్పేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

అయ్యన్న, పట్టాభి కామెంట్స్
టీడీపీలోనూ బూతు పంచాంగం విప్పే నేతలు చాలా మందే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన నేతలు అయ్యన్నపాత్రుడు, పట్టాభి రామ్. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తాజాగా సీఎం జగన్ పై ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు. ఆ తర్వాత తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన పట్టాభి రామ్.. సీఎం జగన్, డీజీపీ సవాంగ్ ను ఉద్దేశించి మరింత దారుణంగా తిట్లు అందుకున్నారు. ఇవి అధికార వైసీపీని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అంతే టీడీపీ కార్యాలయాలు వైసీపీ టార్గెట్ అయిపోయాయి.

తల్లుల తిట్లు, దూషణలు
రాష్ట్రంలో తల్లుల పేర్లతో దూషణలు వినిపించడం గతంలోనూ అక్కడక్కడా కనిపించేది. ఆఫ్ ది రికార్డ్ సమావేశాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేవి. కానీ ఇప్పుడు అదంతా బహిర్గతం అయిపోయింది నేరుగా తల్లుల పేరెత్తకుండానే అదే అర్ధం వచ్చేలా నేతలు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నా రు. తాజాగా టీడీపీ నేత పట్టాభి వాడిన బోసడికే పదం నేరుగా తల్లుల్ని కించపరిచేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చివరికి వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ పై, డీజీపీ సవాంగ్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు.. నిన్న ఆయన్ను అరెస్టు కూడా చేశారు. ఇవాళ సీఎం జగన్ మనవాడు సీఎం కాకపోతే నా తల్లిని కూడా తిడతారా అని ప్రశ్నించారు.

అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా.. అసెంబ్లీలో ఆయన విపక్ష నేత అయిన చంద్రబాబును విమర్శించే క్రమంలో నీ తల్లి కడుపున ఎందుకు పుట్టానని బాధపడతావంటూ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ఆయన ఉద్దేశం చంద్రబాబును తిట్టడమే. కానీ అది కాస్తా టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు తల్లిపై వైఎస్ వ్యాఖ్యలంటూ తెరపైకి తెచ్చింది. దీంతో ఈ వ్యవహారం కొన్నిరోజుల పాటు అప్పటి సీఎం వైఎస్సార్ ను ఇబ్బందిపెట్టింది. ఇప్పుడు నేరుగా టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ గురించి మాట్లాడుతూ బోసడికే పద ప్రయోగం చేశారు. ఇది నేరుగా ఆయన తల్లిపైనే చేశారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ కూడా నా తల్లిని తిడతారా అని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video

టీడీపీ బాధితులుగా వైఎస్సార్, జగన్
గతంలో తాను అనని వ్యాఖ్యలు అన్నట్లుగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టీడీపీ నిందించింది. ఇప్పుడు తమ పార్టీ నేత పట్టాభి నేరుగా సీఎం జగన్ ను ఉద్దేశించి తల్లుల్ని కించపరిచేలా బూతు పదం వాడినా టీడీపీ వెనకేసుకొస్తోంది. తద్వారా ప్రత్యర్ధులు అంటే ఓ ఎత్తు, తమ పార్టీ నేతలు అంటే మరో ఎత్తు అనేలా టీడీపీ రాజకీయాలు చేస్తోంది. ఇది అంతిమంగా అప్పట్లో వైఎస్సార్ ను, ఇప్పుడు జగన్ ను టీడీపీ రాజకీయాల బాధితులుగా మార్చేస్తోంది. ఇప్పుడు జగన్ ను తిట్టిన తమ పార్టీ నేతను వెనకేసుకొస్తున్న టీడీపీ.. తమ కార్యాలయాలపై దాడులు చేశారంటూ రాజకీయాన్ని ప్రత్యర్ధుల్ని ఇరుకునపెట్టేందుకు వాడుకుంటోంది. తద్వారా అప్పుడూ, ఇప్పుడూ తమదే పైచేయి కావాలని చంద్రబాబు యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications