YSRCP Incharge Change: వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో ఇదే కీలకమవుతోందా ?
ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ నాలుగు జాబితాల్లో దాదాపు 60 మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చేశారు. వారి స్ధానాల్లో పలువురు కొత్తవారికి చోటిచ్చారు. అలాగే మరికొందరిని ఇతర చోట్ల సర్దుబాట్లు చేస్తున్నారు. ఇలా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా సీట్లు కోల్పోతున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది ఓ కామన్ ఆరోపణ చేస్తున్నారు. తమకు మరోసారి సీటు కేటాయించకపోవడం వెనుక ఇదే కారణం అంటున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో తమ సిట్టింగ్ స్ధానాలు కోల్పోతున్న పలువురు ఎమ్మెల్యేలు అందుకు ఓ కారణం బలంగా చెప్తున్నారు. అది విపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ను తిట్టలేకపోవడమే తమ కొంప ముంచిందంటున్నారు. నిన్న మొన్నటి పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి వ్యాఖ్యల నుంచి ఇవాళ తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి వరకూ ఇదే మాట వినిపిస్తోంది.

విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ లపై కొడాలి నాని, జోగి రమేష్ తరహాలో విరుచుకుపడాలంటూ అధిష్టానం నుంచి తమకు అందిన ఆదేశాల్ని వీరు లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో తాజా ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో వీరి గ్రాఫ్ తో సంబంధం లేకుండా వీరికి సీట్లు నిరాకరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సదరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. తమకు విపక్ష నేతల్ని తిట్టలేకపోవడమే శాపంగా మారినట్లు వారు అంగీకరిస్తున్నారు.
విపక్ష నేతల్ని దూకుడుగా తిట్టి ఉంటే ఇప్పటికి తమ పరిస్దితి మరోలా ఉండేదని, గ్రాఫ్ తో సంబంధం లేకుండా మరోసారి సీటు ఖరారయ్యేదని సదరు వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. దీంతో విపక్ష నేతల్ని టార్గెట్ చేసే విషయంలో సీఎం జగన్ ఎంత కచ్చితంగా ఉన్నారో అర్ధమవుతోంది. రాజకీయ ప్రత్యర్ధుల్ని తిట్టకుండా మన్నుతిన్న పాముల్లా ఉండిపోతున్న వీరి వల్ల వైసీపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్లడం లేదనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications