తెలుగువారికి మంచిది కాదు: జేసీ, లోకేష్పై కవిత, 'బాబుకు తప్పుడు సలహాలు'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం స్పందించారు. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రస్తుత పరిణామాలు మంచివి కావని అన్నారు. ఇప్పటికైనా ఈ రచ్చ ఆపాలని ఇరు ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
టేబుల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనా అనేది తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అయినా, ఆ టేపుల్లో మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు.
స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమన్నట్లుగా ఉందని, అంతే తప్ప అందులో ఏం లేదన్నారు. దీని గురించి బుర్రలు పాడు చేసుకోవడం అనవసరమన్నారు. ఈ వ్యవహారంలో కేసం భోజనాలు మాని, పడిగాపులు కాయడం ఎందుకని మీడియా ప్రతినిధులపై జాలి ప్రదర్శించారు.
బాబు నోటీసులు తీసుకోకుంటే..: రఘునందన రావు
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే పరిస్థితి వస్తే, తీసుకోవడమే మంచిదని, లేకుంటే అది మరో కేసుగా మారే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది రఘునందన రావు అన్నారు.
ఏసీబీ అధికారులు మెజిస్ట్రేట్ వద్దకు వెళ్తే అరెస్టు వారెంట్ కూడా జారీ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. నోటీసులు అందాక హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. చంద్రబాబుకు సలహాలు ఎవరిస్తున్నారో కానీ, అవి సరైనవి కావని అభిప్రాయపడ్డారు.
లోకేష్కు కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదు: కవిత
తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్కు కేసీఆర్ను విమర్శించే స్థాయి లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ చెప్పారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రా ప్రజల పైన ఏడాది కాలంగా ఎలాంటి దాడులు జరగలేదని వ్యాఖ్యానించారు.