రావెల వివాదంపై బాబు సీరియస్: త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ఆదేశం
ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావును చంద్రబాబు ఆదేశించారు.
విజయవాడ: ప్రస్తుతం ఏపీలో మంత్రి రావెల కిశోర్ బాబు, గుంటూరు జడ్పీ ఛైర్పర్సన్ షేక్ జానీమూన్ వివాదం రసవత్తరంగా నడుస్తోంది. ప్రతిపక్ష వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్రంలో మహిళలకు భద్రతా లేకుండా పోయిందని ఆరోపిస్తోంది.
కాగా మంత్రి రావెల, అతని అనుచరులు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని, తనకు తన భర్తకి ప్రాణ హాని ఉందంటూ షేక్ జానీమూన్ మీడియా ముఖంగా ఆవేదన చెందిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి రావెల.. జానీమూన్ తో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుంటామని చెప్పారు.
వివాదం కాస్త ముదురుతుండటం.. ప్రతిపక్ష పార్టీ దాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతుండటంతో దీనిపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావును చంద్రబాబు ఆదేశించారు.
కమిటీలో రాష్ట్ర మంత్రి చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరి, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు సభ్యులుగా ఉంటారని టీడీపీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టి.డి.జనార్దన్ రెడ్డి చెప్పారు. కమిటీ ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపి, దానికి సంబంధించిన నివేదికను అందజేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.
షేక్ జానీమూన్ ఏమంటున్నారంటే!
ప్రత్తిపాడు నియోజకవర్గంలో మంత్రి రావెల సహాయ నిరాకరణ ధోరణితో వ్యవహరిస్తున్నారని గుంటూరు చైర్ పర్సన్ షేక్ జూనీమూన్ ఆవేదన చెందారు. తాను చేసిన సిఫారసులను బట్టుదాఖలు చేస్తున్నారని, ఏ విషయాన్ని ఖాతరు చేయడం లేదని అన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. అంతు చూస్తామని బెదిరిస్తున్నారని మీడియాతో వాపోయారు. మంత్రి తన అనుచరులను ఇంటికి పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ జానీమూన్ తెలిపారు.