ఏపీలో ఆ ప్రాంతానికి పులి, స్థానికుల భయం.. రంగంలోకి హనుమాన్ బృందాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ సరిహద్దు గ్రామాలలో ఇటీవల పెద్ద పులులు హల్చల్ చేస్తున్నాయి. పాడి పశువులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా పులి పోలవరం జిల్లా రంపచోడవరం మండలానికి సరిహద్దు గ్రామాలలో సంచారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే పులి సంచారం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు.
రంపచోడవరం డివిజన్ లో పులి సంచారం.. అధికారులు అలెర్ట్
రంపచోడవరం డివిజన్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో పులిసంచారం గుర్తించబడినదన్నారు. అదేవిధంగా పులి కదలికలను అటవీ శాఖ అధికారులు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, అదేవిధంగా పులి సంచారం దాని సహజ ప్రవర్తనలో భాగమే అన్నారు. కాబట్టి భయభ్రాంతులకు గురికాకుండా జాగ్రత్తలు పాటించడం మరియు సహకారం అందించడం అత్యంత అవసరమని అన్నారు.

ప్రజలకు అధికారుల సూచనలు
ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో అడవి ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అన్నారు. పులిని దగ్గరగా చూడడం, వెంటపడడం లేదా ఫోటోలు తీయడం చేయవద్దని అదేవిధంగా పశువులను రాత్రి సమయంలో సురక్షితంగా ఉండే విధంగా పశువుల రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అడవి ప్రాంతాలలో పిల్లలు మరియు వృద్ధులు ఒంటరిగా తిరగకుండా జాగ్రత్త ఉండాలని అన్నారు.
పులి సంచారంపై ఎప్పటికప్పుడు అలెర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం
పులి కనిపించిన వెంటనే సమీప అటవీ శాఖ అధికారులను,సిబ్బంది లేదా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు పోలీసు శాఖ, అటవీ శాఖ అధికారులు సిబ్బంది పులి సంచారంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు అడవులకు ఒంటరిగా వెళ్లకుండా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రంగంలో హనుమాన్ బృందాలు
పులి సంచారం పై కొన్ని వదంతులు నమ్మవద్దని అన్నారు. పులిని ప్రేరేపించకుండా అదేవిధంగా ఇబ్బంది పెట్ట చర్యలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు పులిని పర్యవేక్షిస్తూ పట్టుకునే ప్రయత్నం చెయ్యాలన్నారు. హనుమాన్ బృందాలు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పులిపాక ముద్రల ఆధారంగా అది ఏ దిశగా వెళుతుందో, ఆ దిశగా పులి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు.












Click it and Unblock the Notifications