Exit poll Times Now-ETG: ఏపీలో ఆ పార్టీకి భారీ నష్టం
దేశవ్యాప్తంగా చివరి విడత లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతున్నాయి.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా ఏపీపై తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది టైమ్స్ నౌ- ఈటీజీ. ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చి చెప్పింది.

ఈ సర్వే నివేదికల ప్రకారం చూసుకుంటే- ఏపీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి 91 నుంచి 105 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. 49 శాతానికి పైగా ఓట్లు పోల్ అవుతాయి. లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ తన ఖాతాలో వేసుకునేవి 13 నుంచి 15 స్థానాలు ఉండొచ్చని టైమ్స్ నౌ- ఈటీజీ పేర్కొంది.
2019 నాటి ఎన్నికల్లో లోక్సభలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. ఈ సారి ఆ స్థాయిలో సీట్లు దక్కకపోవచ్చు ఈ సర్వే ప్రకారం అంచనా వేసుకుంటే. లోక్సభలో భారీగా ఓట్లను పోగొట్టుకున్నట్టే.
తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 70 నుంచి 84 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి. లోక్సభలో 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ కూటమికి పడే ఓట్ల శాతం 47 శాతం వరకు ఉండొచ్చు. పురుషులతో పోల్చుకుంటే మహిళల ఓట్లే వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని అందజేస్తాయని తేలింది.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే.












Click it and Unblock the Notifications